పూర్తి మద్దతు: మోడీని కలిసిన ముస్లిం మత పెద్దలు
న్యూఢిల్లీ: ముస్లిం సమాజం ఆర్థికంగా సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందేందుకు అన్ని విధాలా పూర్తిగా సహకరిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. సోమవారం దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు ముస్లిం మతపెద్దలు ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ముస్లిం సమాజానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని వారితో చర్చించారు.
మత సామరస్యానికి తాము పూర్తిగా సహకరిస్తామని, జాతీయ భావాన్ని బలోపేతం చేయడంలో తమవంతు బాధ్యతను నిర్వర్తిస్తామని ప్రధానికి ముస్లిం పెద్దలు తెలిపారు. ‘ప్రధాని మోడీ ముస్లిం మత పెద్దలు తెలిపిన సమస్యలను సావధానంగా విన్నారు. ముస్లిం సమాజాన్ని అన్ని విధాలా అభివృద్ధి పర్చేందుకు సహకరిస్తామని వారికి హామి ఇచ్చారు' అని ప్రధాని కార్యాలయం పేర్కొంది.
ముస్లిం యువత సాధికారత దిశగా పయనించాలని, వారు దేశ నిర్మాణంలో ముఖ్య పాత్రను పోషించాలని మోడీ కోరుకుంటున్నట్లు వారికి తెలిపారని పిఎంఓ తెలిపింది. కాగా, పుణ్యక్షేత్రాలు, మసీదులు, మద్రాసాల ఆస్తులకు సంబంధించిన ఫిర్యాదులను మత పెద్దలు ప్రధాని మోడీ ముందుంచారనీ... సావధానంగా విన్న ప్రధాని వారికి హామి ఇచ్చారని పేర్కొంది.

‘విద్యారంగంలో ముస్లిం యువత రాణించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ముస్లిం మత పెద్దలు ప్రధాని దృష్టికి తెచ్చారు. ప్రధాని మోడీ వారికి పూర్తి భరోసా ఇచ్చారు. ముస్లిం సమాజం సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు' అని పిఎంఓ తెలిపింది.
ముస్లిం మత పెద్దలు కూడా తమ సమాజం తరపున మోడీ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తామని చెప్పారని పిఎంఓ పేర్కొంది. అంతేగాక, మత సామరస్యానికి, దేశ ఆర్థిక అభివృద్ధికి, దేశ భద్రత కోసం మోడీ తీసుకుంటున్న చర్యల పట్ల వారు సానుకూలంగా స్పందించారని తెలిపింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు దేశం సమైక్యంగా పోరాడాలని మత పెద్దలు తెలిపినట్లు పిఎంఓ పేర్కొంది.
ప్రధానిని కలిసిన వారిలో సయ్యద్ సుల్తాన్ ఉల్ హసన్ చిస్తి మిస్బాహి(సజ్జదా నషీన్, అజ్మీర్ షరీఫ్), గులాం యాసిన్ సాహిబ్(సహర్ ఖాజీ, వారణాసి), షేక్ వసీం అష్రాఫీ(ఇమామ్ తంజీమ్, ముంబై), మొహ్మద్ హామీద్(నేషనల్ ప్రెసిడెంట్, ఇమామ్ తంజీమ్, నాగ్పూర్), అల్లమ తస్లీమ్ రాజా షాహిబ్(దర్గా బరేల్వీ షరీఫ్, ఉత్తరప్రదేశ్)లతోపాటు పలువురు మతపెద్దలు ఉన్నారు.
అగ్రరాజ్యాలపై మోడీ ఆగ్రహం
అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాలపట్ల అగ్రరాజ్యాలు వ్యవహరిస్తున్న తీరు గర్హనీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. సోమవారం ఢిల్లీలో పర్యావరణ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్న జాతీయ పర్యావరణ సదస్సులో ఆయన ప్రసంగించారు. నానాటికి పెరిగిపోతోన్న కాలుష్యాన్ని అదుపు చేసేందుకు అభివృద్ధి చెందిన దేశాలు మాటలే తప్ప చేతలకు సిద్ధపడవని ఆరోపించారు.
పర్యావరణ హితం కోసం పెద్ద స్థాయిలో అణుశక్తిని వినియోగంలోకి తేవాలనే భారత్ ప్రయత్నాలను ఆయా దేశాలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. ప్రకృతిని దైవంగా భావించడం భారతీయుల సంప్రదాయంలో భాగమన్నారు.












Click it and Unblock the Notifications