వ్యాక్సిన్లపై మోదీ యూటర్న్: ఘనత మాదేనన్న విపక్ష సీఎంలు -కరోనా థార్డ్ వేవ్ ఆగుతుందన్న బీజేపీ సీఎంలు
దేశంలో కరోనా విలయానికి అడ్డుకట్టగా భావిస్తోన్న వ్యాక్సిన్ల విషయంలో కేంద్రం తీరు అసమంజసంగా ఉందంటూ అటు సుప్రీంకోర్టు చివాట్లు, ఇటు రాష్ట్రాల మొత్తుకోలు, విపక్షాల తీవ్ర విమర్శలు, మిత్రపక్షాల నుంచి సూచనలు, సామాన్య జనం చీదరింపుల ఎదురుకాగా, ఎట్టకేలకు మోదీ సర్కార్ జాతీయ వ్యాక్సినేషన్ విధానంపై యూటర్న్ తీసుకుంది. 18-44 ఏళ్ల వారికి టీకాలు అందించేలా రాష్ట్రాలపై మోపిన బాధ్యతను ఇకపై తామే తీసుకుంటామని, దేశంలో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్లు అందిస్తామంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. జాతిని ఉద్దేశించి సోమవారం సాయంత్రం ఇచ్చిన సందేశంలో ఆయనీ విషయాన్ని తెలిపారు. అయితే, వ్యాక్సినేషన్ ప్రక్రియపై కేంద్రం యూటర్న్ తీసుకోవడం తమ ఘనతేనంటూ విపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు చెప్పుకుంటుండటం గమనార్హం.

తిడుతూనే వరాలిచ్చిన మోదీ
కరోనా తొలి వేవ్ లో ప్రజలను ఉద్దేశించి తరచూ సందేశాలిచ్చిన మోదీ.. అతి ప్రమాదకరంగా సాగిన రెండో వేవ్ లో మాత్రం దాదాపు మౌనంగా ఉండిపోయారు. అగ్రదేశాలన్నీ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయగా, భారత్ లో మాత్రం వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. మోదీ సర్కార్ అలసత్వం వల్లే టీకాల కొరత ఏర్పడిందని విపక్షాలు మండిపడ్డాయి. జాతీయ వ్యాక్సినేషన్ విధానాన్ని సవరించాలంటూ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టులు పట్టుపట్టడంతో కేంద్రం దిగిరాకతప్పలేదు. అయితే ఆ పనిని మోదీ తనదైన చమత్కారంతో ప్రకటించారు. రాష్ట్రాల వ్యాఖ్యలు, న్యాయస్థానాల తీర్పులు, సోషల్ మీడియాలో వెక్కిరింపులను తిప్పికొడుతూ, దాదాపు ఎదురుదాడి చేసినట్లుగా పదాలను వాడుతూ, మొత్తానికి దేశమంతటికీ ఉచిత వ్యాక్సిన్లను కేంద్రమే ఇస్తుందని, జూన్ 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారి కోసం రాష్ట్రాలకు కేంద్రమే వ్యాక్సిన్లను సరఫరా చేస్తుందని, ప్రైవేట్ ఆసుపత్రలకు 25 శాతం డోసులు ఇస్తామని ప్రధాని ప్రకటించారు. దీనిపై..

కరోనా మూడో వేవ్ తప్పినట్లే..
వ్యాక్సినేషన్ విషయంలో ప్రధాని మోదీ సందేశంపై బీజేపీ ముఖ్యమంత్రులు హర్షం వ్యక్తం చేశారు. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ, ఉచిత వ్యాక్సిన్లు ఇస్తామన్న ప్రధాని మోదీ నిర్ణయంతో రాష్ట్రాలపై భారం తగ్గుతుందని, 18 ఏళ్లు నిండిన అందరికీ టీకాలు వేయడం ద్వారా భారత్ కరోనా మూడో వేవ్ విలయం నుంచి తప్పించుకోవచ్చని అన్నారు. దేశప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్లతోపాటు గరీబ్ కల్యాణ్ యోజన అమలును మరికొంత కాలం పొడిగించినందుకు గానూ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ భాగస్వామి, బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. కాగా,

మోదీ యూటర్న్ క్రెడిట్ మాదే..
కేంద్రం వ్యాక్సిన్ పాలసీని మార్చుకోవడానికి తామంటే తామే కారణమంటూ విపక్ష ముఖ్యమంత్రులు, బీజేపీ-కాంగ్రెస్ లకు సమాన దూరం పాటిస్తున్నవారూ చెప్పుకుంటుండటం గమనార్హం. కేంద్రం వ్యాక్సినేషన్ విధానాన్ని మార్చుకోవాలంటూ దేశంలో తొలిసారిగా లేఖలు రాసిన కేరళ సీఎం పినరయి విజయన్.. ప్రధాని సందేశంపై స్పందించారు. జూన్ 21 నుంచే రాష్ట్రాలుకు ఉచితంగా కేంద్రమే టీకాలు అందజేయనుండటం శుభపరిణామమని, అవసరమైన సమయంలో మోదీ సరైన నిర్ణయం తీసుకున్నారని, వ్యాక్సిన్ల విషయంలో కేరళ ప్రభుత్వం చేసిన వినతిని గుర్తించడం వల్లే ఇది సాధ్యమైందని విజయన్ చెప్పుకొచ్చారు. ఇక కాంగ్రెస్ మాత్రం ఎప్పటిలాగే మోదీకి చురకలు వేసింది. రాష్ట్రాలకు కేంద్రమే వ్యాక్సిన్లు అందించే బాధ్యతను ఆరు నెలల కిందటే తీసుకుని ఉండాల్సిందని, ప్రైవేటు ఆస్పత్రులకు 25 శాతం డోసుల కేటాయింపు చాలా ఎక్కువని ఛత్తీస్ గఢ్ ఆరోగ్య మంత్రి టీఎస్ సింద్ దియో అన్నారు.












Click it and Unblock the Notifications