ప్రధాని మోడీ, అమిత్ షాలు వివరణ ఇవ్వాలి: బెంగాల్లో కేంద్ర బృందాలపై మమతా బెనర్జీ ఫైర్
కోల్కతా: కేంద్రంపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘనలను పరిశీలించేందుకు కేంద్ర బృందాలను తమ రాష్ట్రానికి ఎందుకు పంపిస్తున్నారో ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా చెప్పాలని మమతా డిమాండ్ చేశారు.

వివరణ ఇచ్చేంత వరకూ..
కోల్కతా సహా ఏడు జిల్లాల్లో లాక్డౌన్ అమలును తనిఖీ చేసేందుకు రెండు అంతర్ మంత్రిత్వ బృందాలు ఇప్పటికే బెంగాల్ చేరుకున్నాయి. అయితే, తమకు వివరణ ఇచ్చేంత వరకు వారికి సహకరించబోమని సీఎం మమతా బెనర్జీ అంటున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని, హోంమంత్రికి ఆమె లేఖ కూడా రాశారు. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధించారు.

ముందుకు కదలనివ్వం..
కొవిడ్-19 సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కేంద్ర ప్రభుత్వం చేసే సూచనలు, నిర్మాణాత్మక మద్దతును తాము స్వాగతిస్తామని, అయితే దేని ఆధారంగా బెంగాల్ సహా దేశ వ్యాప్తంగా ఐఎంసీటీ(కేంద్ర బృందాలు)లను పంపిస్తున్నారో తెలియడం లేదని అన్నారు. ఇందుకు ప్రాతిపదిక ఏంటో ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా చెప్పాలని ప్రశ్నించారు. సరైన కారణాలు చెప్పనంత వరకు తాము దీనిపై ముందుకు కదిలే ప్రసక్తే లేదని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతమేనని మమతా చెప్పుకొచ్చారు.

15 నిమిషాల ముందు చెబుతారా?
రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించిన15 నిమిషాల్లోనే రెండు బృందాలు బెంగాల్లో దిగాయని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ సిన్హా తెలిపారు. కేంద్ర బృందాల పర్యటన గురించి చెప్పారు కానీ, తమను అడగలేదని, బృందాలు వచ్చే 15 నిమిషాల ముందే తమకు సమాచారం ఇచ్చారని తెలిపారు. ఒక బృందం జల్పాయ్గుడి, మరోటి కోల్కతాలో దిగిందని తెలిపారు. తామేదో దాస్తున్నట్లు వారు ప్రవర్తిస్తున్నారని, తాము వారిని రాష్ట్రంలో తిరిగనివ్వమని అన్నారు. అంతేగాక, వారు బీఎస్ఎఫ్తో వచ్చి పర్యటనకు వెళ్లారు, తాము దీన్ని అంగీకరించమని చెప్పుకొచ్చారు. తమను సంప్రదించాకే క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలని సిన్హా స్పష్టం చేశారు.

లాక్డౌన్ నిబంధనల అమలుపై కేంద్రం నిఘా..
కాగా, దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్డౌన్ నిబంధనలను పాటించడం లేదని తమకు నివేదికలు అందాయని కేంద్రం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముంబై, పుణె, ఇండోర్, కోల్కతా, పశ్చిమబెంగాల్లోని మరికొన్ని ప్రాంతాల్లో పరిస్తితి ప్రమాదకరంగా ఉందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులను పరిశీలించేందుకు కేంద్ర బృందాలను పంపింది. ఇప్పటికే కేరళ ప్రభుత్వం కేంద్రానికి వివరణ ఇచ్చింది. తాము లాక్డౌన్ ఉల్లంఘనలకు పాల్పడటం లేదని తెలిపింది.












Click it and Unblock the Notifications