ఎల్లుండితో ముగియనున్న గుజరాత్ తొలిదశ ప్రచారం-నేడు మోడీ, అమిత్ షా భారీ ర్యాలీలు..
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఓవైపు ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్న బీజేపీ... మరోవైపు తొలిసారి అధికారం కోసం ఆప్, సుదీర్ఘకాలం తర్వాత సత్తా చాటుకోవాలని కాంగ్రెస్ ఎదురుచూస్తున్నాయి. దీంతో ఆయా పార్టీల కీలక నేతలంతా ఇప్పుడు గుజరాత్ లోనే పాగా వేశారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ సమీపిస్తున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ రాష్ట్రంలో పలు బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఇవాళ భావ్నగర్లోని పాలిటానా, కచ్లోని అంజర్, జామ్నగర్, రాజ్కోట్లలో మోడీ ర్యాలీలు జరగనున్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ప్రచార సమయం పూర్తికావడంతో ప్రధాని మోదీ గుజరాత్లో పర్యటించడం ఇదే చివరి సారి కానుంది. ఇప్పటికే గుజరాత్ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్న మోడీ... ఆదివారం సూరత్ లో భారీ బహిరంగకు హాజరయ్యారు.

మరోవైపు అన్ని పార్టీల జాతీయ స్ధాయి నేతలంతా గుజరాత్ ప్రచారంలో బిజీగా కనిపిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్తో సహా అన్ని పార్టీలకు చెందిన జాతీయనాయకులు ఓటర్లను ఆకర్షించేందుకు రాష్ట్రంలో పాగా వేశారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ఇవాళ గుజరాత్లోని ఖేరాలు, సావ్లి, భిలోడా, నారన్పురాలోని నాలుగు స్థానాల్లో ఎన్నికల ర్యాలీలు నిర్వహించనున్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ, ఆప్, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ నెలకొన్న నేపథ్యంలో ఈసారి ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది. సుదీర్ఘకాలం రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ప్రజావ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు కాంగ్రెస్, ఆప్ తీవ్రంగా ప్రయత్నిస్తుండగా.. విపక్షాల మధ్య ఓట్ల చీలిక తమకు లాభిస్తుందని బీజేపీ అంచనా వేస్తోంది. డిసెంబర్ 1న తొలిదశ ఎన్నికలు పూర్తయితే కానీ రాష్ట్రంలో ఓటర్ల మొగ్గు ఎటువైపు ఉందన్న విషయం తెలిసే అవకాశాలు కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications