మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేలు, ఎక్స్గ్రేషియా ప్రకటించిన మోడీ
ఫ్యాక్టరీ ప్రమాద మృతుల కుటుంబాలకు కేంద్రం కూడా ఆర్థిక సాయం ప్రకటించింది. 43 మంది మృతుల కుటుంబాలకు తలా రూ.2 లక్షలు అందజేస్తామని ప్రధాని మోడీ తెలిపారు. గాయపడ్డవారికి రూ.50 వేలు అందజేస్తామని తెలిపారు. మృతుల కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం కూడా ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడ్డవారికి రూ.1 లక్ష అందజేస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. తెలిపారు. కేంద్ర సాయంతో మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం 12 లక్షలకు చేరనుంది. మృతులకు లక్ష 50 వేలు సాయం అందనుంది.
యజమానిపై కేసు..
అనాజ్ మందీలో ఫ్యాక్టరీ బిల్డింగ్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. యజమాని పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. కానీ అతని సోదరుడిని కూడా అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రమాదంపై ప్రతీ ఒక్కరు స్పందిస్తున్నారు. విషాదఘటనగా అభివర్ణిస్తున్నారు. కర్ణాటక సీఎం యడియూరప్ప.. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
ఫైర్ సిబ్బందికి సెల్యూట్
ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన సిబ్బందిని ప్రతీ ఒక్కరు కొనియాడుతున్నారు. ఇప్పటికే సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసించగా.. ఆప్ ఎమ్మెల్యే సత్యేంద్ర జైన్ కూడా పొగడ్తల వర్షం కురిపించారు. ఓ అధికారి 11 మందిని కాపాడారని ట్వీట్ చేశారు. మరోవైపు చనిపోయిన వారికి కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ సంతాపం వ్యక్తం చేశారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
గౌతం కాంట్రవర్సీ..
ఘటనపై ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలని బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిని తాను రాజకీయం చేయాలనుకోవడం లేదని చెప్తూనే.. అధికార ఆప్పై విమర్శలు గుప్పించారు. ఘటనాస్థలానికి ఫోరెన్సిక్ బృందం చేరుకొని.. శాంపిల్స్ సేకరిస్తోంది. ఫ్యాక్టరీలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పేర్కొన్నారు. శిథిలాల కింద ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది.
ఎవరినీ వదలం
ప్రమాదంపై గల కారణాలు దర్యాప్తులో తేలుతాయని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొన్నది. ప్రమాదం ఎవరు చేసినా ఉపేక్షించబోమని తేల్చిచెప్పింది. బాధ్యులపై చర్యలు తప్పవని ఢిల్లీ మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ స్పష్టంచేశారు. ఝాన్సీ రోడ్లో ఉన్న పరిశ్రమ 600 చదరపు అడుగుల్లో విస్తరించి ఉంది. ఉదయం 5.22 గంటలకు ప్రమాదం జరిగింది. ఆ సమయంలోనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ రావడంతో.. హుటహుటిన బయల్దేరి వెళ్లారు.