అమెరికా నుంచి భారత్కు 25 మిలియన్ల వ్యాక్సిన్ డోసులు-కమలా హ్యారిస్కు మోదీ ధన్యవాదాలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అమెరికా గ్లోబల్ వ్యాక్సిన్ స్ట్రాటజీలో భాగంగా భారత్కు 25 మిలియన్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేయాలన్న ఆ దేశ నిర్ణయానికి అభినందనలు చెప్పారు. అమెరికా ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయ సహకారాలకు ధన్యవాదాలు తెలియజేశారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హ్యారిస్ ప్రధాని నరేంద్ర మోదీతో గురువారం(జూన్ 3) ఫోన్లో సంభాషించారు.
ఈ సందర్భంగా భారత్-అమెరికా మధ్య వ్యాక్సిన్ సహాయ,సహకారాల బలోపేతానికై సాగుతున్న ప్రయత్నాలపై చర్చించినట్లు మోదీ తెలిపారు. కోవిడ్ అనంతరం అంతర్జాతీయ సమాజపు ఆరోగ్యం,ఆర్థిక పరిస్థితిని పునరుద్దరించేందుకు రెండు దేశాల భాగస్వామ్య సామర్థ్యంపై చర్చించినట్లు వెల్లడించారు.
కరోనా వేళ భారత్తో పాటు పలు దేశాలకు వ్యాక్సిన్లు పంపిణీ చేసి ఆదుకోవాలని అమెరికా నిర్ణయించింది. ఈ మేరకు గురువారం(జూన్ 3) భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు గ్యాటిమాల అధ్యక్షుడు అలెజండ్రో గియమట్టై,మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రెడార్,కరేబియన్ కమ్యూనిటీ ఛైర్మన్ కీత్ రౌలేలతో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపారు.
నాలుగు దేశాల ప్రధానులు,అధ్యక్షులతో ఫోన్ సంభాషణ సందర్భంగా... వ్యాక్సిన్ కవరేజీని మరింత విస్తృతం చేయడం,అత్యవసర పరిస్థితులు,ప్రజారోగ్య అవసరాలపై స్పందించడం,వ్యాక్సిన్లు కోరే దేశాల్లో వీలైనన్ని దేశాలకు సహాయం చేయడంపై దృష్టి సారించినట్లు కమలా హ్యారిస్ చెప్పారని ఆమె సీనియర్ అడ్వైజర్ సైమోన్ సాండర్స్ తెలిపారు. ఇందుకు ఆయా దేశాల అధ్యక్షులు,ప్రధానులు ధన్యవాదాలు తెలియజేశారన్నారు.
Recommended Video
ఆయా దేశాలకు మొత్తం 80 మిలియన్ల వ్యాక్సిన్ డోసులను ఈ ఏడాది జూన్ చివరి నాటికి పంపిణీ చేయాలని అమెరికా నిర్ణయించింది. ఇందులో 25 మిలియన్ల డోసులను భారత్కు పంపించనుంది.