ఆత్మరక్షణ కాదు.. ఎదురుదాడి చేద్దాం.. సీఏఏపై ఎన్డీఏ నేతలకు ప్రధాని మోదీ నిర్దేశం
పౌరసత్వ సవరణ చట్టం(సీసీఏ) అమల్లోకి వచ్చి 40 రోజులు కావొస్తున్నా దేశవ్యాప్తంగా నిరసలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీల సంగతి పక్కనపెడితే, మిత్రపార్టీలు కూడా సీఏఏపై అనుమానాలు వ్యక్తం చేస్తుండటం కేంద్ర సర్కారుకు ఇబ్బందికర పరిణామంగా తలెత్తింది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా రంగంలోకి దిగి మిత్రులకు నిర్దేశం చేశారు.

సీఏఏ చుట్టూ చర్చ..
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో శుక్రవారం ఎన్డీఏ పార్టీల సమావేశం జరిగింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో.. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించారు. సీఏఏపైనా కీలక చర్చ నడిచింది. పౌరసత్వ సవరణ చట్టం విషయంలో ఎన్డీఏ సభ్యులెవరూ ఆత్మరక్షణలో పడాల్సిన అవసరంలేదని, పార్లమెంట్లో అనర్గళంగా మాట్లాడాలని మోదీ సూచించారు.

తిప్పికొడదాం..
పౌరసత్వ సవరణ చట్టం వల్ల దేశంలోని ముస్లింలకు నష్టం జరుగుతుందంటూ ప్రతిపక్ష పార్టీలు లేనిపోని భయాలు, పుకార్లను వ్యాపింపజేస్తున్నాయని, అందులో ఒక్కశాతం నిజం కూడా లేదని ఎన్డీఏ సభ్యులతో మోదీ అన్నారు. అలాంటి తప్పుడు ప్రచారాలను ధీటుగా ఎదుర్కోవాలని, ప్రతిపక్షాలపై అవసరమైతే ఎదురుదాడికి కూడా వెనుకాడొద్దని ప్రధాని సూచించారు.

ప్రతిపక్ష పార్టీలూ అదే దారిలో..
సీఏఏపై పార్లమెంటులో పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాలని ప్రతిపక్ష పార్టీలు ఇదివరకే నిర్ణయించుకున్నాయి. శుక్రవారం రాష్ట్రపతి ప్రసంగం సందర్భంలోనూ ప్రతిపక్ష ఎంపీలు నల్ల బ్యాడ్జిలతో పార్లమెంట్ కు వచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ మిత్రులకు ప్రధాని మోదీ చేసిన ఎదురుదాడి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications