కరోనాలో మోదీ ఎన్నికల వ్యూహాలు -యూపీ అసెంబ్లీపై బీజేపీ-ఆర్ఎస్ఎస్ మథనం -గంగలో భారీగా మృతదేహాలు
కొవిడ్ పరిస్థితుల నిర్వహణలో వైఫల్యాలు పార్టీపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయనే ఆందోళనల నడుమ భారతీయ జనతాపార్టీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం వ్యూహాలను సిద్దం చేసే పనిని ప్రారంభించింది. వచ్చే ఏడాది ఆరంభంలో జరుగనున్న యూపీ ఎన్నికల కోసం బీజేపీ, దాని సైద్ధాంతిక సంస్థ ఆర్ఎస్ఎస్ మేధోమథనం జరిపాయి. ఆదివారం జరిగిన ఈ కీలక భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాలుపంచుకున్నారు. దేశంలో కరోనా విలయ తాండవం కొనసాగుతుండటం, ఉత్తరప్రదేశ్ లోని నదుల్లో వందలాది కొవిడ్ మృతదేహాలు కొట్టుకొస్తున్న వేళ బీజేపీ పెద్దల ఎన్నికల సన్నద్ధతపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది..

ప్రధాని మోదీ పోల్ స్ట్రాటజీ..
పార్టీ రహితంగా జరిగినవే అయినప్పటికీ, ఇటీవలి ఉత్తరప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు భారీ సంఖ్యలో ఓడిపోవడం, సమాజ్ వాదీ పార్టీ, ఇతర విపక్షాలు బాగా పుంజుకోగా, అధికార బీజేపీ రెండో స్థానానికి పరిమితం కావడం తెలిసిందే. ఆ ఎన్నికలపై విశ్లేషణతోపాటు వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ పోరుపై కొవిడ్ సంక్షోభ ప్రభావం, బీజేపీని మరింతగా బలోపేతం చేయడానికి అవలంభించాల్సిన వ్యూహాలపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ పెద్దలు చర్చించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో జరిగిన ఈ స్టాటజిక్ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) సునీల్ బన్సల్, ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు దత్తాత్రేయ హోసబాలే తదితరులు హాజరయ్యారు. నిజానికి

యూపీలో కరోనా విలయం..
యూపీలో కొవిడ్ పరిస్థితుల నిర్వహణలో యోగి సర్కారు వైఫల్యాలను విపక్షాలేకాదు, సొంత పక్షం వారే ఎత్తి చూపుతుండటం పరిపాటిగా మారింది. సాక్ష్యాత్తూ కేంద్ర మంత్రి సంతోష్ గాంగ్వర్ తన బరేలీ నియోజకవర్గంలో ఆస్పత్రుల దుస్థితిపై నేరుగా ముఖ్యమంత్రి యోగికే ఫిర్యాదు చేశారు. బరేలీలోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు ఖాళీ అయ్యాయని, ఫోన్ చేసినా అధికారులెవరూ ఎత్తడం లేదని, ఆరోగ్య కేంద్రాలు నుంచి జిల్లా ఆస్పత్రులకు వెళ్లిన రిఫరల్ కేసులను తిప్పి పంపుతున్నారని, దైవ్య పరికరాలను అధిక ధరలకు అమ్ముతున్నారంటూ కేంద్ర మంత్రి తన లేఖలో పేర్కొన్నారు. యూపీకే చెందిన సీతాపూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రాథోడ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో ఐసీయూ బెడ్ల కొరత ఉందని, అయితే ఏది మాట్లాడినా దేశద్రోహం కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో గమ్మున ఉంటున్నానని వాపోయారు. కొవిడ్ సహాయక చర్యలు ముమ్మరం చేయాలంటూ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు జేపీ నడ్డా లేఖలు రాసినా పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. మరోవైపు..

గంగలో శవాలు.. వ్యూహాల్లో పార్టీలు..
ఉత్తరప్రదేశ్ లో కరోనా పరిస్థితి తీవ్రతను తెలియజేస్తూ గంగానది ఒడ్డున రోజుకోచోట ఇసుకలో కుప్పలు తెప్పలుగా మృతదేహాలు బయటపడుతుండడం కలకలం సృష్టిస్తోంది. ఇవన్నీ కొవిడ్ మృతులవేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆయా జిల్లా యంత్రాంగం మాత్రం ఎలాంటి స్పష్టతనివ్వలేదు. ప్రయాగ్రాజ్ జిల్లా దేవరఖ్ ఘాట్ వద్ద ఇసుకలో వందల మృతదేహాలు బయటపడ్డాయి. శ్మశాన వాటికల్లో ఖాళీ లేకపోవటం, అంత్యక్రియలకు ఖర్చు పెరగటం వల్ల నది ఒడ్డునే ఇసుకలో పూడ్చి పెడుతున్నారని స్థానికులు తెలిపారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మృతదేహాలను పూడ్చిపెట్టడాన్ని నిషేధించింది. కొవిడ్ కల్లోలం ఇంత తీవ్రంగా ఉంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ పెద్దలు మాత్రం ఎన్నికల వ్యూహాల్లో బిజీ అయ్యారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications