ట్రంపే తరిమేస్తుంటే.. ఇక మనకూ తప్పదు..! తేల్చేసిన మోడీ...!
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న పశ్చిమబెంగాల్లో ప్రధాని మోడీ ఇవాళ సుడిగాలి ప్రచారం చేశారు. రాష్ట్రంలోని మాల్దాలో ఇవాళ వందే భారత్ స్లీపర్ రైలుతో పాటు నాలుగు అమృత్ భారత్ రైళ్లను కూడా ప్రారంభించిన ప్రధాని.. అనంతరం నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చొరబాటుదారుల ఏరివేతకు చేపడుతున్న చర్యల్ని ప్రధాని సమర్ధించుకున్నారు.
రాష్ట్రంలో భారీ ఎత్తున చొరబాట్లను ప్రోత్సహిస్తున్నారని మమతా బెనర్జీ సర్కార్ పై ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు చేశారు.రాష్ట్రంలో జరుగుతున్న భారీ చొరబాట్లు రాష్ట్ర జనాభా లెక్కల్ని మార్చాయని, అలాగే అనేక జిల్లాల్లో హింసకు దారితీశాయని ఆరోపించారు. రాజకీయ ప్రోత్సాహంతో ఇది పెరుగుతోందన్నారు. పశ్చిమ బెంగాల్ ముందు చొరబాట్లు అతిపెద్ద సవాళ్లలో ఒకటిగా నిలిచిందన్నారు. అనేక అభివృద్ధి చెందిన దేశాలు చేస్తున్నట్లుగానే వీటిపై కఠిన చర్యలు అవసరమని తెలిపారు.

బెంగాల్ ముందు చొరబాట్లు చాలా పెద్ద సవాలు అని ప్రధాని తెలిపారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన, సంపన్న దేశాలు డబ్బు కొరత లేకుండా ఉన్నాయి, అయినప్పటికీ అవి వలసల్ని తొలగిస్తున్నాయని మోడీ గుర్తుచేశారు. పశ్చిమ బెంగాల్ నుండి చొరబాట్లను తొలగించడం కూడా అంతే అవసరం అన్నారు. తాజాగా జరిగిన హింసాత్మక సంఘటనలను వలసల సమస్యతో ముడిపెడుతూ, చొరబాట్ల కారణంగా మాల్డా, ముర్షిదాబాద్తో సహా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో చొరబాటుదారులను స్థిరపరచడానికి పాలక టిఎంసి సిండికేట్ వ్యవస్థ చురుకుగా పనిచేస్తోందని విమర్శించారు. దీని వలన అనేక ప్రాంతాలలో జనాభా మార్పులు వస్తున్నాయని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications