ఏది నిజం?: సౌదీ రాజుకు కాళ్లకు ప్రధాని మోడీ మొక్కారా?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ సౌదీ పర్యటనలో ఉన్న సమయంలో ఆ దేశ రాజు సల్మాన్ బిన్ అబ్దులాజిద్ అల్ సౌద్ కాళ్లు మొక్కారని చూపుతూ, ఓ సంచలన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన సీఎన్ఎన్-ఐబీఎన్ జర్నలిస్ట్ రాఘవ్ చోప్రాపై కేసు నమోదైంది.
వివరాల్లోకి వెళితే.... గతంలో ఓ బహిరంగ సభలో బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ కాళ్లకు నమస్కరిస్తున్న ఫోటోను తీసుకుని, దానిని మార్ఫింగ్ చేసి సౌదీ రాజు కాళ్లకు ప్రధాని మోడీ మొక్కుతున్నట్లు మార్ఫింగ్ ఫోటోను సృష్టించాడు. ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా గతంలో అద్వానీ కాళ్లకు నమస్కరిస్తున్న చిత్రాన్ని తీసుకుని, దాన్ని మార్ఫింగ్ చేసి ఈ ఫోటోను తయారు చేశారని తెలుసుకున్న బీజేపీ టెక్నాలజీ సెల్ ఇన్ చార్జ్ అరవింద్ గుప్తా, ఢిల్లీ సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఈ విషయాన్ని సమాచార ప్రసార శాఖ దృష్టికి కూడా తీసుకెళ్లారు.
దీంతో మోడీ మార్ఫింగ్ ఫొటోపై విచారణకు ఆదేశిస్తున్నట్లు సమాచార శాఖ తెలిపింది. విషయాన్ని ఐటీ శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లామని పేర్కొంది. ఇక, మార్ఫింగ్ ఫొటోను పెట్టిన జర్నలిస్ట్ రాఘవ్ చోప్రా విచారం వ్యక్తం చేశారు. అవాంఛనీయంగా జరిగిన తప్పిదానికి మోడీకి, ప్రజలందరికీ క్షమాపణలు చెబుతున్నట్లు వెల్లడించారు.
అదే విధంగా, సదరు ఛానల్ కూడా క్షమాపణలు కోరింది. అంతకముందు రాఘవ్ చోప్రా పెట్టిన మార్ఫింగ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో సౌదీ రాజు కాళ్లు మొక్కి భారత్ పరువు తీశారని ప్రధాని మోడీపై పెద్దఎత్తున నెటిజన్లు విమర్శలు గుప్పించారు.
దీంతో బీజేపీ టెక్నాలజీ సెల్ ఇన్చార్జ్ రంగంలోకి దిగి అసలు విషయాన్ని ప్రజలకు తెలియజేయడంతో జర్నలిస్ట్ వైఖరిని తీవ్రంగా తప్పుబడుతున్నారు. దీనిపై స్పందించిన రాఘవ్ చోప్రా క్షమించాలని కోరాడు. మార్ఫింగ్ చేసిన చిత్రాన్ని, అసలు చిత్రాన్నీ మీరు పైన చూడొచ్చు.