ప్రధాని మోదీ మళ్లీ షాకిచ్చారు.. సోషల్ మీడియాపై నిషేధం.. అసలు కారణం తెలిస్తే అవాక్కే..
ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ నాయకుల్లో ఒకరిగా.. భూగోళం నిండా అభిమానులు, అరాధకులున్న వ్యక్తిగా.. 130 కోట్ల మంది భారతీయులకు ప్రధానిగా.. చరిత్రలో చెరిగిపోని ముద్ర నరేంద్ర మోదీది. అందరికంటే భిన్నంగా పని చేసే ఆయన.. సంచలన నిర్ణయాలకు ఏమాత్రం వెనుకాడరు. సడెన్గా పాకిస్తాన్లో ప్రత్యక్షం కావడం నుంచి పెద్ద నోట్ల రద్దు దాకా.. చాలా సందర్భాల్లో ఆయన ప్రజల్ని షాక్కు గురిచేశారు. కొన్ని గంటల కిందటే.. 'ఇక నేను సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పబోతున్నా..''అంటూ మరో బాంబు పేల్చారు. తీవ్ర ఉత్కంఠకు తెరదించుతూ మంగళవారం మళ్లీ ఆయనే అసలు విషయం చెప్పుకొచ్చారు. ఈ గ్యాప్ లో చాలా చాలా జరిగాయి..
Recommended Video
అమెరికా కంపెనీలపై గుస్సా..
సోషల్ మీడియాను వదిలేస్తున్నానంటూ మోదీ ప్రకటన చేసిన తర్వాత దేశమంతా దాని గురించే చర్చించుకుంది. రకరకాల వాదలనలు, స్పెక్యులేషన్లు తెరపైకి వచ్చాయి. అందులో ఒకటి ‘ఇండియాలో సోషల్ మీడియాపై నిషేధం'. ఒకప్పుడు మోదీతో సఖ్యతగా మెలిగిన అమెరికా దిగ్గజ సంస్థలు.. ఆయన రెండో సారి ప్రధాని అయిన తర్వాతనుంచి పెద్ద ఎత్తున నెగటివ్ క్యాంపెయిన్ చేసిందని, ప్రధానంగా సీఏఏ, ఎన్ఆర్సీలపై ఉద్యమాలు బలపడటానికి, ఢిల్లీలో అల్లర్లు చెలరేగడానికి సోషల్ మీడియా సంస్థల తీరే కారణమని, వాటికి గట్టిగా బుద్ధి చెప్పడానికే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం చాలా బలంగా సాగింది. ఇటీవల అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ కు ఢిల్లీలో జరిగిన పరాభవాన్ని ఒక ఉదాహరణగానూ పేర్కొన్నారు.
మోదీతోపాటే మేమూ గుడ్ బై చెబుతాం..
చైనాలో వైబో తరహాలో పూర్తిగా దేశీ టెక్నాలజీతో రూపొందించిన సరికొత్త సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ను ప్రధాని మోదీ ప్రారంభించబోతున్నారని, అందుకే ట్విటర్, ఫేస్ బుక్, యూట్యూబ్, ఇన్స్టా లాంటి విదేశీ యాప్ల నుంచి వైదొలగబోతున్నట్లు వార్తలు వచ్చాయి. మోదీకి దగ్గరివ్యక్తిగా పేరున్న రిపబ్లిక్ టీవీ అధినేత అర్నబ్ గోస్వామి మరో అడుగు ముందుకేసి.. ‘‘మోదీ సోషల్ మీడియా నుంచి వెళ్లిపోతే.. మీరు కూడా నిష్క్రమిస్తారా'' అంటూ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. మోదీ ఫాలోవర్లలో 70 శాతం మంది.. అవుననే సమాధానం చెప్పడం గమనార్హం. తీరా మంగళవారం మధ్యాహ్నానికి గానీ ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిగడంతో ఈ తరహా ప్రచారాలకు తెరపడింది.
మహిళా దినోత్సవం కోసమే..
‘‘ఈ ఆదివారం సోషల్ మీడియా నుంచి విశ్రాంతి తీసుకోబోతున్నా..''అంటూ ప్రధాని మోదీ చేసిన సంచలన ట్వీట్ వెనుక అసలు అర్థాన్ని, కారణాన్ని ఆయనే వెల్లడించారు. ఈ ఆదివాంర(మార్చి 8న) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మోదీ నిజంగానే సోషల్ మీడియా జోలికి వెళ్లబోరు. బదులుగా ఆయన ట్విటర్, ఎఫ్బీ, యూట్యూబ్, ఇన్స్టా అకౌంట్లను మహిళలే నిర్వహించనున్నారు. ఎంపిక చేసిన మహిళలు.. ఆ ఒక్క రోజూ ప్రధాని అధికారిక అకౌంట్ల ద్వారా తమ అనుభవాల్ని ప్రజలతో పంచుకుంటారు. ఇందుకోసం..
ఆమెనే మనకు ప్రేరణ(షి ఇన్స్పైర్స్ యూ)
మహిళా దినోత్సవం రోజున ప్రధాని మోదీ సోషల్ మీడియా అకౌంట్లను నిర్వహించబోయే మహిళల్ని ఎంపిక చేసేందుకు ‘‘షి ఇన్స్పైర్స్ యూ'' పేరుతో కొత్త క్యాంపెయిన్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని కూడా మోదీనే వెల్లడించారు. ‘‘స్వయంగా మీరుగానీ లేదా మీ చుట్టుపక్కన ఉన్నవాళ్లలో స్ఫూర్తిమంతమైన మహిళలుంటే.. దేశానికి ఏదైనా చెప్పాలనుకుంటే మీమీ వీడియోలను #SheInspiresUs పై పోస్టు చేయండి. సెలెక్ట్ అయినవాళ్లకు ఈ నెల 8న ప్రధాని అకౌంట్లను నిర్వహించే అవకాశం దక్కుతుంది'' అని మోదీ వివరించారు. దీనికి సంబంధించిన పోస్టర్లను కూడా ఆయన విడుదల చేశారు. అంతకుముందు..
సోషల్ మీడియాపై నిషేధం..
మహిళా దినోత్సవం సందర్భంగా తాను చేయబోయే బృహత్ కార్యక్రమానికి సంబంధించి ప్రధాని మోదీ సోమవారం వదిలిన ‘నిష్క్రమణ' ట్వీట్ పై ప్రముఖులు విపరీతంగా స్పందించారు. మోదీ ప్రకటన దేశంలో సోషల్ మీడియా నిషేదానికి టీజర్ లాంటిదని.. అది త్వరలోనే పూర్తి స్థాయి నిషేధం విధించబోతున్నారని బీజేపీకే చెందిన మోదీ బద్ధ వ్యతిరేకి సుధీంద్ర కులకర్ణి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాను వాడుకోవడంలో కొత్త ట్రెండ్ సెట్ చేసిన మోదీ ఆ పని చేసే అవకాశమేలేదన్న వాదన కూడా బలంగానే సాగింది.
కథ సుఖాంతం..
2009లోనే సోషల్ మీడియాలో చేరిన మోదీ ఆ మాధ్యమాల్లో పెద్ద సెలబ్రిటీగా మారారు. ఆయనకు ట్విటర్లో 5.33 కోట్లు, ఫేస్బుక్లో 4.4 కోట్లు, ఇన్స్టాలో 3.52 కోట్లు, యూట్యూబ్లో 0.45 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారు.మొత్తానికి ఒక్క ట్వీట్ తో తీవ్ర ఉత్కంఠ రేపిన ప్రధాని మోదీ.. మహిళా దినోత్సవానికి అదనపు అటెన్షన్ కల్పించడానికే ఆ పని చేశానని చెప్పడంతో మిగతా వాదనలన్నీ పటాపంచలయ్యాయి. సో, మోదీ అభిమానులెవరూ సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పాల్సిన అవసరం లేదన్నమాట.