హర్యానా తరహాలోనే మహారాష్ట్ర కూడా మాదే-3 రాష్ట్రాలు కాంగ్రెస్ ఏటీఎంలన్న మోడీ..!
మహారాష్ట్ర ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్దం ముదురుతోంది. ఇదే క్రమంలో ఇవాళ నాందేడ్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని మోడీ.. కాంగ్రెస్ పార్టీతో పాటు గాంధీ కుటుంబంపై నిప్పులు చెరిగారు. హర్యానా తరహాలో మహారాష్ట్రలోనూ ప్రజలు తమను గెలిపిస్తారని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. గాందీ కుటుంబం మూడు రాష్ట్రాల్ని ఏటీఎంలుగా మార్చుకుందని తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేతలు భారత రాజ్యాంగం అని చెప్పుకుంటూ ఓ ఖాళీ రెడ్ బుక్ చూపిస్తున్నారని ప్రధాని మోడీ ఆరోపించారు.
అంతకు ముందు అకోలాలో జరిగిన ర్యాలీలనూ ప్రధాని మోడీ ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిపై విమర్శలు గుప్పించారు. మహావికాస్ అఘాడీ అంటే అవినీతి, వేల కోట్ల రూపాయల కుంభకోణాలు అని ఆరోపించారు. నిన్న ధూలే, నాసిక్లలో బీజేపీ ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ ఐక్యంగా ఉంటే సురక్షితంగా ఉంటారంటూ దళితులు, గిరిజనులు, ఓబీసీలకు పిలుపునిచ్చారు. మరోవైపు ప్రధాని మోడీ ఎన్సీపీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కు మద్దతుగా బారామతిలో సభ నిర్వహించకపోవడంపై విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఎన్సీపీ మోడీ చిన్న ప్రాంతాలకు రారని సెటైర్లు వేశారు.

మహారాష్ట్రలో ఈ నెల 20న ఒకే దశలో 288 సీట్లకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కాంగ్రెస్, శివసేన ఉద్ధవ్ వర్గం, ఎన్సీపీ శరద్ పవార్ వర్గంతో కూడిన మహా వికాస్ అఘాడీ కూటమితో బీజేపీ నేతృత్వంలోని అధికార మహాయుతి కూటమి తలపడుతోంది. ఇరు కూటముల మధ్య గట్టి పోటీ నెలకొంది. ముఖ్యంగా గత లోక్ సభ ఎన్నికల్లో విపక్ష కూటమి మంచి ఫలితాలు రాబట్టిన నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని అధికార కూటమిలో టెన్షన్ పెరుగుతోంది.












Click it and Unblock the Notifications