కాంగ్రెస్ ముక్త భారత్ చేద్దామనుకుంటే బీజేపీ ముక్త దక్షిణాది అయ్యిందా ?
కర్నాటకలో ఇవాళ వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా పలు మార్పులకు కారణమయ్యేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒకప్పుడు భారీ మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోడీ ప్రవచించిన కాంగ్రెస్ ముక్త భారత్ నినాదం తిరగబడేలా కనిపిస్తోంది.
తాజాగా జరిగిన కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ అధికారం కోల్పోవడమే దీనికి కారణం. ఈ ఏడాది చివర్లో జరిగే రాజస్తాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్ ఘడ్ ఎన్నికలపైనా వీటి ప్రభావం పడబోతోంది.

కాంగ్రెస్ పార్టీ 2014లో కేంద్రంలో అధికారం కోల్పోయిన తర్వాత పలు రాష్ట్రాల్లో క్రమంగా అధికారం పోగొట్టుకుంటూ వచ్చింది. ముఖ్యంగా చాలా రాష్ట్రాల్లో బొటాబొటీ మెజారిటీ సాధించిన సందర్భాల్లోనూ అధికారం అందుకోలేకపోయింది. అలాగే సొంత ప్రభుత్వాలు ఉండి కూడా బీజేపీ ప్రలోభాలకు తెరదీయడంతో పలు రాష్ట్రాల్ల అధికారం పోగొట్టుకుంది.
దీంతో కాంగ్రెస్ ముక్త భారత్ నినాదం తెరపైకి వచ్చింది. ఓ దశలో ఇది నిజమయ్యేలా కనిపించింది. గతేడాది పంజాబ్ లో కాంగ్రెస్ అధికారం పోగొట్టుకున్న తర్వాత ఇక ఆ పార్టీకి మిగిలిన రాష్ట్రాలు ఛత్తీస్ ఘడ్, రాజస్తాన్ మాత్రమే. దీంతో కాంగ్రెస్ ముక్త భారత్ నిజమవుతందేమో అనిపించింది.
కానీ తాజాగా హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్, ఇప్పుడు కర్నాటకలోనూ గెలిచి తాము సొంతంగా అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్యను నాలుగుకు పెంచుకుంది. తమిళనాడుతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో మిగతా పార్టీలతో అధికారం పంచుకుంటోంది.
ఇలాంటి సమయంలో కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ సాధించిన గెలుపు కాంగ్రెస్ ముక్త భారత్ సంగతేమో కానీ బీజేపీ ముక్త్ దక్షిణాదిగా మారిపోయింది. కర్నాటకలో ఓటమితో దక్షిణాదిలో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఎక్కడా బీజేపీ అధికారంలో లేకుండా పోయింది.
వాస్తవానికి దక్షిణాదిలో కాషాయ పార్టీకి అధికారం అందించిన తొలి రాష్ట్రం కర్నాటకలో కొన్నేళ్ల క్రితం వరకూ మితవాద, అభివృద్ధి ఆధారిత రాజకీయాలు చేసిన బీజేపీ.. ఈసారి మాత్రం రెచ్చిపోయింది. ఉత్తరాది రాష్ట్రాల తరహాలో మతం ఆధారంగా రాజకీయాలు చేసింది.
ఇక్కడి ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా హలాల్, హిజాబ్ వంటి అంశాలు తెరపైకి తెచ్చి జనాన్ని రెచ్చగొట్టింది. ఫలితం అతికష్టం మీద అధికారం సాధించిన కర్నాటక కూడా చేజారిపోయింది. అంతేకాదు దక్షిణాది నుంచి కాషాయ పతాకం తెరమరుగయ్యే పరిస్ధితి ఏర్పడింది.












Click it and Unblock the Notifications