మణిపూర్ లో వివస్త్రగా మహిళల ఊరేగింపు, హత్య-మోడీ సీరియస్-దేశానికే అవమానమన్న ప్రధాని..
మణిపూర్ లో రెండు నెలలుగా సాగుతున్న హింస తాజాగా మరో మలుపు తిరిగింది. ఇప్పటివరకూ ప్రత్యర్ధులపై దాడులు చేసుకుంటున్న కుకీలు, మెయిటీలు ఇప్పుడు మరో అడుగు వేసి ఓ మహిళను వివస్త్రను చేసి రోడ్లపై ఊరేగించారు. ఈ ఘటనపై ప్రధాని మోడీ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన దేశానికే అవమానం అన్నారు. బాధ్యులు ఎవరైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో మణిపూర్ విషయంలో ఇప్పటివరకూ మౌనంగా ఉంటున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న మోడీ..ఇప్పుడు ఏం చేయబోతున్నారనే చర్చ సాగుతోంది.
మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన భయానక వీడియో బుధవారం వైరల్ అయింది. దీంతో తన హృదయం బాధతో నిండిపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మణిపూర్ ఆడబిడ్డలకు జరిగిన ఘోరాన్ని ఎప్పటికీ క్షమించలేమన్నారు. ఈ ఘటన దేశానికి సిగ్గుచేటని, దోషులను వదిలిపెట్టబోమని పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఈ వీడియోలో ఇద్దరు మహిళలను ఓ గుంపు నగ్నంగా ఊరేగించి, వేధింపులకు గురి చేసి, మైదానంలోకి లాగారు. అక్కడ వారు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

మణిపూర్ లో షెడ్యూల్డ్ తెగల హోదా కోసం మెయిటీలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో మణిపూర్లోని లోయ-మెజారిటీ మెయిటీలు, కొండల్లో ఎక్కువగా ఉండే కుకీ తెగల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణలు చెలరేగిన ఒక రోజు తర్వాత అంటే మే 4న ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పటివరకూ మణిపూర్ లో చోటు చేసుకున్న జాతుల హింసలో 120 మందికి పైగా మరణించారు. వేలాది మంది తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. వీరంతా ఇప్పటికీ సహాయ శిబిరాల్లో నివసిస్తున్నారు.
మరోవైపు మణిపూర్ లో ఇంత జరుగుతున్నా ప్రధాని మోడీ మాత్రం అక్కడికి వెళ్లలేదు. మిగతా బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు మాత్రమే అక్కడ పర్యటిస్తున్నారు. దీనిపై విపక్షాలు ఇప్పటికీ మోడీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా మహిళను వివస్త్రను చేసి ఊరేగించిన వీడియో వైరల్ కావడంతో కేంద్రం మరింత ఇరుకునపడింది. దీంతో ప్రధాని మోడీ స్పందించక తప్పలేదు. అయితే చర్యల విషయంలో మాత్రం కేంద్రం ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేని పరిస్దితి ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications