PM Modi US Visit : ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన-ఐదు రోజుల షెడ్యూల్ ఇదే...
ప్రధాని నరేంద్ర మోదీ ఐదు రోజుల అమెరికా పర్యటన అధికారికంగా ఖరారైంది. సెప్టెంబర్ 22 నుంచి 26 వరకు మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా క్వాడ్ సభ్య దేశాల అధినేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ మేరకు విదేశాంగ సెక్రటరీ హర్షవర్దన్ శ్రింగ్లా వివరాలు వెల్లడించారు.
ఆసియన్ నాటోగా 'క్వాడ్' అవతరించబోతుందా... విదేశాంగ మంత్రి జైశంకర్ ఏమంటున్నారు...
సెప్టెంబర్ 22న ప్రధాని మోదీ వాషింగ్టన్లో అడుగుపెట్టడంతో ఆయన పర్యటన మొదలుకానుంది. ఆ మరుసటి రోజు అమెరికాకు చెందిన ఐదుగురు టాప్ సీఈవోలతో మోదీ భేటీ అవుతారు. ఇందులో ఆపిల్ సీఈవో టిమ్ కుక్ కూడా పాల్గొనున్నట్లు తెలుస్తోంది.అదే రోజు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్తో మోదీ భేటీ అవుతారు.
సెప్టెంబర్ 23న ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపనీస్ ప్రధాని సుగాతో భేటీ అయి ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఆ తర్వాత క్వాడ్ దేశాల అధినేతలకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇచ్చే విందులో మోదీ పాల్గొంటారు.ఈ నెల 24న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో వైట్ హౌస్లో మోదీ భేటీ అవుతారు. ఈ భేటీలో ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు,రక్షణ వ్యవస్థ బలోపేతం,భద్రతాపరమైన సహాయ సహకారాలు,రెన్యువబుల్ ఎనర్జీ భాగస్వామ్యాన్ని పెంపొందించడం, తదితర అంశాలపై చర్చించనున్నారు. అలాగే ఆఫ్గన్ పరిణామాల నేపథ్యంలో ప్రాంతీయ భద్రత,సీమాంతర ఉగ్రవాదం,అంతర్జాతీయ ఉగ్ర సంస్థల నెట్వర్క్స్ను విచ్చిన్నం చేయడం వంటి అంశాలు కూడా చర్చకు రానున్నాయి.
అదేరోజు బైడెన్ నేతృత్వంలో వైట్హౌస్లో జరిగే క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొంటారు. ఈ సదస్సుకు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపనీస్ ప్రధాని యోషియిడే సుగా కూడా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా అఫ్ఘానిస్తాన్లో నెలకొన్న పరిణామాలు, ఇండో-పసిఫిక్ అజెండా, కోవిడ్-19, వాతావరణ మార్పులు వంటి అంశాలు చర్చకు రానున్నాయి. 25న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో మోదీ ప్రసంగిస్తారు.పర్యటనలో మోదీ వెంట విదేశాంగ మంత్రి జైశంకర్,జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఉండనున్నారు.బైడెన్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక మోదీ అమెరికాలో అడుగుపెడుతుండటం ఇదే తొలిసారి కావడంతో ఈ పర్యటన మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.
అసలేంటీ క్వాడ్ :
ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు క్వాడ్ ఏర్పడింది.చాలాకాలంగా ఈ ప్రాంతంలో చైనా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు క్వాడ్ పురుడుపోసుకుంది. నిజానికి క్వాడ్ మరో నాటో గ్రూపుగా అవతరించనుందా అనే ప్రశ్నలు కూడా ఇప్పటికీ ఉత్పన్నమవుతూనే ఉన్నాయి.భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఆ వాదనను పలు సందర్భాల్లో తోసిపుచ్చారు.క్వాడ్ విస్తరణపై తాము దృష్టి పెట్టలేదని పలుమార్లు స్పష్టం చేశారు.కేవలం చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకే కాకుండా క్వాడ్ సభ్య దేశాలు వీలైనంత మేర ఆయా రంగాల్లో పరస్పర సహకారం అందించుకోవడానికి ఇదొక వేదికగా నిలుస్తున్నది.తాజాగా అమెరికా వేదికగా జరగబోయే క్వాడ్ శిఖరాగ్ర సమావేశంలో నిర్మాణాత్మక ఎజెండా ఉంటుందని విదేశాంగ సెక్రటరీ హర్షవర్దన్ శ్రింగ్లా వెల్లడించారు.