ఆసియాలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్ ప్రారంభించిన మోడీ: భారత్ ఆదర్శమని యూఎన్ ప్రశంస
భోపాల్: సౌర విద్యుత్ అనేది శుద్ధమైనది.. శ్రేష్టమైనది.. భద్రమైనదని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్లోని రేవాలో ఏర్పాటు చేసిన ఆసియాలోనే అతిపెద్దదైన 750 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రధాని మోడీ శుక్రవారం ప్రారంభించారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. సొలార్ ప్లాంట్ను జాతికి అంకితం చేశారు.
Recommended Video
అగ్రశ్రేణి దేశాల సరసన భారత్..
సౌర విద్యుత్ రంగంలో ప్రపంచంలోనే ఆకర్షణీయ మార్కెట్గా భారత్ ఎదిగిందని ప్రధాని అన్నారు. రేవా సౌర విద్యుత్ ప్లాంటుతో మధ్యప్రదేశ్ శుద్ధ, సౌర ఇంధనానికి కేంద్రంగా ఎదుగుతుందని మోడీ వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టు పూర్తితో సౌర విద్యుత్ ఉత్పత్తిలో ఐదు అగ్రశ్రేణి దేశాల సరసన భారత్ చేరిందని తెలిపారు.
పర్యావరణహిత విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ దేశ వ్యాప్తంగా 36 కోట్ల ఎల్ఈడీ బల్బులను అందజేశామని ప్రధాని మోడీ తెలిపారు. డిమాండ్ పెరగడం వల్ల ఉత్పత్తి కూడా భారీగా పెరగడంతో ఈ బల్బుల ధర పదింతలు తగ్గిందని తెలిపారు.
ఢిల్లీ మెట్రోకూ రేవా నుంచే విద్యుత్..
ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో విద్యుత్ రంగం కీలక భూమిక పోషిస్తోందని తెలిపారు. రేవాలోని 750 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటుతో స్థానిక పరిశ్రమలతోపాటు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కు కూడా విద్యుత్ సరఫరా అవుతుందని ప్రధాని మోడీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం 22 డిసెంబర్ 2017న ప్రాజెక్టు పనులను ప్రారంభించింది. దాదాపు మూడేళ్ల తర్వాత ఈ ప్లాంట్ పూర్తయింది. ఈ సౌర విద్యుత్ ప్లాంటును 1590 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు.
భారత్ ఆదర్శమంటూ ఐక్యరాజ్యసమితి
ఇది ఇలావుండగా, కరోనా సంక్షోభ సమయంలోనూ సౌర విద్యుత్ను ప్రోత్సహిస్తున్న భారత్ ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచిందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు. క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ సమ్మిట్ పేరిట జరిగిన సదస్సులో మాట్లాడుతూ ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించారు. 2020లో ప్రపంచ వ్యాప్తంగా వృద్ధి నమోదు చేసే రంగం కేవలం పునరుత్పాదక ఇంధన రంగమేనని స్పష్టం చేశారు. సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయడంలో ప్రపంచంలో భారత్లా మరే దేశం ముందుకు సాగడం లేదన్నారు.












Click it and Unblock the Notifications