ఐఎన్ఎస్ కోల్కతా జాతికి అంకితం: మోడీ(ఫొటో)
ముంబై: భారత దేశాన్ని కాపాడుతున్నది సైనిక దళాలేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శనివారం ముంబై తీరంలో జరిగిన కార్యక్రమంలో ఐఎన్ఎస్ కోల్కతాను ప్రధాని జాతికి అంకితం చేశారు. దేశంలోనే ఇది అతి పెద్ద నౌక కావడం గమనార్హం. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ యుద్ధనౌక బరువు 7,500 టన్నులు.
ఈ సందర్భంగా నావికాదళ సిబ్బందిని ఉద్దేశించి మోడీ ప్రసంగించారు.
ఐఎన్ఎస్ కోల్కతా చేరిత తర్వాత భారత రక్షణ సామర్థ్యాన్ని ఏ దేశమూ సవాలు చేయలేదని మోడీ పేర్కొన్నారు. యుద్ధానికి సిద్ధమే కానీ, కయ్యానికి కాలు దువ్వమని ఆయన తెలిపారు. ఐఎన్ఎస్ కోల్కతా తయారితో మన దేశ పరిజ్ఞానాన్ని చాటి చెప్పామని నరేంద్ర మోడీ ప్రశంసించారు.
ఐఎన్ఎస్ కోల్కతా నౌకను తయారు చేసిన శాస్త్రవేత్తలను అభినందించకుండా ఉండలేకపోతున్నానని ఆయన అన్నారు. సైనికులు దేశానికి ఎనలేని సేవ చేస్తున్నారని, అనుక్షణం సరిహద్దులో కంటికి రెప్పలా కాపాడుతున్నారని అన్నారు.
దేశ చరిత్రలో ఛత్రపతి శివాజీ కూడా సముద్ర రక్షణకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిన విషయాన్ని మోడీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. రక్షణ శాఖ టెక్నాలజీ పెంచేందుకు ఎక్కువ నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. కేంద్ర రక్షణమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. ఇవాళ దేశానికి, రక్షణ శాఖకు చారిత్రకమైన రోజుగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్, నేవీ ప్రధానాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.