కేజ్రీవాల్కు ఈసీ హెచ్చరిక, మోడీపై రాహుల్ గాంధీ ఆగ్రహం
ఢిల్లీ: ఇతర పార్టీలు ఇచ్చే డబ్బులు తీసుకోండంటూ ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ ఓటర్లకు పదేపదే పిలుపునివ్వడాన్ని ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. పలుమార్లు నోటీసులు ఇచ్చినా లెక్కచేయకుండా ధిక్కరించడాన్ని సహించేది లేదని మంగళవారం స్పష్టం చేసింది.
ఎన్నికల ప్రచార సభల్లో ఇకముందు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర చర్యలు తప్పవని చెప్పింది. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని మాటిమాటికీ ఉల్లంఘిస్తున్నారని, ఇకముందు ఇలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండని పక్షంలో కఠిన చర్యలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించింది.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చే డబ్బులు తీసుకుని ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయాలంటూ ఎన్నికల సభల్లో కేజ్రీవాల్ తరచుగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ, కాంగ్రెస్ సహా ఇతరుల నుంచి కూడా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ ఫిర్యాదులపై తీవ్రంగా స్పందించిన ఇసి, కేజ్రీవాల్కు తాజాగా ఆదేశాలు జారీచేసింది.
కేజ్రీవాల్ అభ్యర్థిత్వం రద్దు చేయండి
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేజ్రీవాల్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్, బీజేపీలు ఈసీని కోరాయి. మరోవైపు, ఆమ్ ఆద్మీ పార్టీ తన ప్రచారంలో కిరణ్ బేడీ ఫటోను వాడుకుంటోందని, అవకాశ రాజకీయాలకు పాల్పడుతోందని కేజ్రీకి కిరణ్ బేడీ నోటీసులు ఇచ్చారు.
నరేంద్ర మోడీపై రాహుల్ గాంధీ ఆగ్రహం
ప్రధాని నరేంద్ర మోడీ తన సొంత పలుకుబడిని పెంచుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారని, ఇప్పటి వరకు నిర్మాణాత్మకంగా ఒక్క పని కూడా చేయలేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ధ్వజమెత్తారు. ఎన్డీఏ ప్రభుత్వం గత ఏడాది మేలో అధికారంలోకి వచ్చిందని, ఇప్పటి వరకు ఏం చేయలేదన్నారు.
ఇంకా మోడీ చేతలు మొదలుపెట్టేది ఎప్పుడు అని ప్రశ్నించారు. మాట్లాడడం ఆపేసి పని చేయడం ఎప్పుడు ప్రారంభిస్తారని జనం మిమ్మల్ని అడుగుతున్నారని, కొందరికి మాత్రమే ప్రయోజనం చేకూరుస్తున్నారు తప్పితే పేదల కోసం ఏమీ చేయడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, మేము పేదలకు అండగా నిలుస్తున్నాం కాబట్టి, వారి చేతులు పట్టుకుని అభివృద్ధి బాటలో నడిపిస్తుంది కాబట్టే మేము మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు.