కరోనాపై పోరాటానికి వలంటీర్ల సైన్యం: ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ హెల్ప్: జిల్లాల్లో సంక్షోభ నిర్వహణ బృందాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ యథేచ్ఛగా పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనాను ఎదుర్కొనడానికి తీసుకోవాల్సిన చర్యలపై వారికి దిశానిర్దేశం చేశారు. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలను ప్రశంసిస్తూనే ఇక ముందు ఎలాంటి ముందుజాగ్రత్తలను తీసుకోవాలనే అంశం మీద నరేంద్ర మోడీ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పలు సూచనలను ఇచ్చారు.
Recommended Video

కరోనాపై పోరాటానికి వలంటీర్లే సైన్యం
కరోనా వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి వలంటీర్ల సహకారాన్ని తీసుకోవాలని ప్రధానమంత్రి సూచించారు. దీనికోసం ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వంటి వలంటీర్లను బరిలో దింపాలని చెప్పారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, పారామెడికల్ స్టాఫ్, ఆయూష్ డాక్టర్లతో జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా సంక్షోభ నివారణా బృందాలను వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం ఒక్కో మండలాన్ని ఒక్కో యూనిట్గా తీసుకోవాలని అన్నారు. మండల స్థాయి సిబ్బందిని సంక్షోభ నిర్వహణ బృందాలతో అనుసంధానించాలని చెప్పారు.

వచ్చే రెండు వారాలు అత్యంత కీలకం..
వచ్చే రెండు వారాలు అత్యంత కీలకమైనవని ప్రధాని మరోసారి గుర్తు చేశారు. ప్రాణనష్టాన్ని వీలైనంత వరకు తగ్గించాలని, అదే ప్రథమ కర్తవ్యం కావాలని అన్నారు. ప్రాణనష్టాన్ని నివారించడనికి అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని చెప్పారు. కేంద్రం నుంచి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన సహాయక చర్యలను అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. కరోనాపై పోరాటంలో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాల్సిందేనని, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని పోరు సాగించాలని చెప్పారు.

టెస్టింగ్, ట్రేసింగ్, ఐసొలేషన్, క్వారంటైన్..
కరోనా వైరస్ను నివారించడంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని కీలక అంశాలను అనుసరించాలని సూచించారు. కరోనా వైరస్ సోకిన వారిని గుర్తించడంలో టెస్టింగ్, ట్రేసింగ్, ఐసొలేషన్, క్వారంటైన్.. ఈ నాలుగే అంత్యంత ప్రధానమైనవని, ఈ ప్రాథమిక సూత్రాన్ని అనుసరించడం ద్వారా కరోనాపై విజయాన్ని సాధించవచ్చని నరేంద్ర మోడీ చెప్పారు. పోలీసు వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలని అన్నారు.

లాక్డౌన్ వృధా కాకూడదు..
21 రోజుల పాటు దేశం మొత్తం లాక్డౌన్లోకి వెళ్లిపోయిందని, కరోనా వైరస్పై పోరాటాన్ని సాగించడానికి ఉద్దేశించిన ఈ లాక్డౌన్.. ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా కాకూడదని ప్రధాని చెప్పారు. లాక్డౌన్లో ఉన్నప్పటి పరిస్థితులను ఆ తరువాత కూడా ప్రతి ఒక్కరు చిత్తశుద్ధితో కొనసాగించాల్సి ఉంటుందని చెప్పారు. దీన్ని ప్రతి పౌరుడు దీన్ని తమ ప్రథమ కర్తవ్యంగా గుర్తించాలని, అప్పుడే పోరాటం విజయవంతమౌతుందని ప్రధాని సూచించినట్లు తెలిపారు.

పేషెంట్ల కోసం అవసరమైతే ప్రత్యేక ఆసుపత్రులు..
కరోనా వైరస్ సోకిన పేషెంట్ల కోసం అవసరమైతే ప్రత్యేకంగా ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకుని రావాలని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుకు సూచించారు. డాక్టర్ల సంఖ్యను పెంచాలని అన్నారు. ప్రభుత్వ శాఖలు, వేర్వేరు విభాగాలు, అధికార యంత్రాంగంతో పాటు అందుబాటులో ఉన్న అన్ని మానవ వనరులను విస్తృతంగా వినియోగించుకోవాలని చెప్పారు. అత్యవసరమైన వైద్య ఉత్పత్తులు, మందులను తయారు చేయడానికి అవసరమైన ముడి పదార్థాలు, పరికరాలను ముందే సిద్ధం చేసుకోవాలని అన్నారు. మందుల కొరత రాకుండా ముందు జాగ్రత్త చర్యల చేపట్టాలని, ముందుచూపుతో వ్యవహరించాలని చెప్పారు.












Click it and Unblock the Notifications