బాల్ థాకరే పట్ల గౌరవంతోనే శివసేనపై ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం మధ్యాహ్నాం మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లా టాస్గాంలో జరుగుతున్న ఎన్నికల ప్రచార సభలో పాల్గోన్నారు. ఈ సభలో ప్రధాని మాట్లాడుతూ గుజరాత్ మహారాష్ట్రకి చిన్న తమ్ముడిలాంటిదన్నారు.
ఎన్సీపీ అధ్యక్షుడు పవార్ ముఖ్యమంత్రిగా ఉండి మహారాష్ట్రకు చేసిందేమీ లేదని, మహారాష్ట్రను ఏలిన నేతలు ప్రజలను మోసం చేశారని అన్నారు. బాలాసాహెబ్ థాకరే(బాల్ థాకరే) కన్నుమూసిన తర్వాత మహారాష్ట్రకు ఇవి తొలి ఎన్నికలని, ఆయన పట్ల గౌరవంతో తాను శివసేన గురించి మాట్లాడం లేదని ప్రధాని మోడీ ప్రకటించారు.
మహారాష్ట్ర మరింత అభివృద్ధి ఆధించాలంటే బీజేపీకే పట్టం కట్టాలని ఆయన కోరారు. 60 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీ నర్మదా ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.
నేను అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేయించానని ఆయన తెలిపారు. అక్కడ పని ప్రారంభమైందని, ఒకటి, రెండు రోజుల్లో మహారాష్ట్రకు రూ. 400 కోట్లకు పైగా విలువైన విద్యుత్ అండుబాటులోకి వస్తుందని మోడీ తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీ శనివారం హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ను విమర్శించారు. అంతే కాదు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న పార్టీలను కూడా ఏకిపారేశారు.
మహారాష్ట్రలో శనివారం మూడు ర్యాలీల్లో పాల్గొన్న ప్రధాని మోడీ, ఎక్కడ కూడా శివసేనను గురించి ప్రస్తావించలేదు. దాదాపుగా 25 ఏళ్ల పాటు ఎన్నికల్లో కలిసే పోటీ చేసిన బీజేపీ, శివసేనలు తాజాగా సీట్ల సర్దుబాటులో తలెత్తిన విభేదాల కారణంగా మహారాష్ట్ర ఎన్నికల్లో ఒంటరిగానే పోటీలోకి దిగాయి.
ప్రధాని మోడీ తన ఐదు రోజుల అమెరికా పర్యటనలో ఉండగా... రెండు పార్టీల మధ్య పొత్తు చెడిన విషయం తెలిసిందే. ఐతే బీజేపీతో విడిపోయి, తాను సాధించేదేమీ లేదన్నట్లుగా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే వ్యవహరించారు.
అమెరికా నుంచి మోడీ తిరిగి వచ్చాక, ఆయనతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటానంటూ ఉద్ధవ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మోడీ, తన ఎన్నికల ప్రచారంలో ఎక్కడ కూడా శివసేన ప్రస్తావన తీసుకురాకపోవడం చర్చకు దారితీస్తుంది.
గోపీనాథ్ ముండే జీవించి ఉంటే తాను మహారాష్ట్రకు రావాల్సిన అవసరం ఉండేది కాదని మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ తన ప్రసంగంలో చెప్పారు. గోపినాథ్ ముండే తన తమ్ముడని, బిజెపి ప్రభుత్వం వస్తే మహారాష్ట్రను రక్షిస్తుందని ఆయన అన్నారు.
60 రోజుల్లో తాను ఏం చేశానని అడుగుతున్నారని, అయితే గత 60 ఏళ్లలో కాంగ్రెసు ఏం చేసిందని మోడీ అడిగారు. చైనా మహారాష్ట్రలో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేస్తుందని చెప్పారు.