2025లో భారత్ సాగించిన ప్రయాణం, సాధించిన విజయాలు గుర్తు చేసిన పీఎం మోదీ
2025సంవత్సరం మరో రెండు రోజుల్లో ముగుస్తోంది. ఈ సంవత్సరమంతా దేశం సాగించిన ప్రయాణం, సాధించిన విజయాలు ప్రతీ ఒక్కరూ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉండగా, నేడు భారత ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ ఏడాది సాధించిన విజయాలను గుర్తు చేశారు.
అన్ని రంగాలలోనూ భారత్ బలమైన ముద్ర
ఈ ఏడాది అన్ని రంగాల్లో భారత్ తనదైన బలమైన ముద్ర వేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జాతీయ భద్రత నుంచి క్రీడల వరకు, వైజ్ఞానిక రంగంనుంచి ప్రపంచ వేదికల వరకు అన్ని రంగాల్లో దేశం విజయాలను చవి చూసిందని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్ తన భద్రతా విషయంలో రాజీ పడదని ప్రపంచం స్పష్టంగా చూసిందని ప్రధానమంత్రి అన్నారు.

ప్రయాగ్ రాజ్ కుంభమేళా, అయోధ్య రామాలయ ధ్వజారోహణపై మోదీ
2025 ప్రారంభంలో ప్రయాగ్రాజ్లో జరిగిన మహా కుంభమేళా ఒక అద్భుతం అని ప్రధాని మోదీ తెలిపారు. అక్కడికి తరలివచ్చిన కోట్లాదిమంది భక్తులను చూసి భారత దేశ సంస్కృతి, సాంప్రదాయాల విషయంలో ప్రపంచం ఆశ్చర్యపోయిందన్నారు. అలాగే సంవత్సరం చివరలో అయోధ్య రామాలయంలో జరిగిన 'ధ్వజారోహణ' కార్యక్రమం కూడా ప్రతి భారతీయుడిలో గర్వాన్ని నింపిందని మోదీ గుర్తు చేశారు. 'వందేమాతరం' గీతం 150ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలు చూపించిన ఉత్సాహం అద్భుతమన్నారు.
వికసిత్ భారత్ యంగ్లీడర్స్ డైలాగ్ అండ్ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2025
వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ అండ్ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2025 లో యువత భాగస్వామ్యం పెరగడం సంతోషంగా ఉందన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఈ అంశంపై క్విజ్ పోటీల్లో ఈ ఏడాది 50 లక్షలకు పైగా యువతీ యువకులు పాల్గొన్నారని చెప్పారు. యంగ్ లీడర్స్ డైలాగ్ రెండో కార్యక్రమం వచ్చేనెల 12వ తేదీ స్వామి వివేకానంద జయంతి రోజున జరుగుతుందన్నారు.
యాంటీ బయాటిక్స్ వినియోగంపై ప్రధాని మోదీ
యువత ఆలోచనలను కార్యాచరణగా మార్చే మరో మాధ్యమం 'స్మార్ట్ ఇండియా హ్యాకథాన్' అంటూ, ఇంత వరకు 13 లక్షలకు పైగా విద్యార్థులు 'స్మార్ట్ ఇండియా హ్యాకథాన్'లో పాల్గొన్నారని, ఆరు వేల కంటే ఎక్కువ సంస్థలు ఈ హ్యాకథాన్ లో పాలుపంచుకున్నాయన్నారు. యాంటీ బయాటిక్స్ మందులను ప్రజలు ఇష్టం వచ్చినట్లు ఉపయోగించ వద్దన్నారు..ఐ.సి.ఎం.ఆర్. తాజా నివేదికలో న్యుమోనియా, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వంటి వ్యాధులకు వీటివల్ల పెద్దగా ఉపయోగం లేదని చెప్పిందన్నారు.
ఏపీలో లేస్ క్రాఫ్ట్స్ పై ప్రధాని మోదీ
మన సంప్రదాయ కళలు సమాజాన్ని శక్తిమంతం చేయడమే కాకుండా ప్రజల ఆర్థిక పురోగతికి మాధ్యమంగా మారుతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్లోని నరసాపురం ప్రాంతానికి చెందిన లేస్ క్రాఫ్ట్ కు లభిస్తున్న ఆదరణను ప్రస్తావించారు. ఈ కళ కొత్త రూపురేఖలతో విస్తరించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం, నాబార్డ్ కృషి చేస్తున్నాయన్నారు. దీనివల్ల , 250 కంటే ఎక్కువ గ్రామాల్లో సుమారు లక్ష మంది మహిళలు 500కు పైగా ఉత్పత్తులతో ఉపాధి పొందుతున్నారని ప్రధానమంత్రి చెప్పారు.
పి.ఎం. సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన గురించి చెప్పిన మోదీ
మణిపూర్కు చెందిన మోయిరంగ్ థెమ్ సేథ్ సౌరశక్తి ప్రచారం తో వందలాది ఇళ్లలో కరెంటు వచ్చిందన్నారు. అలాగే, మణిపూర్ లోని అనేక ఆరోగ్య కేంద్రాలు సౌరశక్తిని పొందుతున్నాయన్నారు. దేశ వ్యాప్తంగా 'పి.ఎం. సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన' కింద కేంద్ర ప్రభుత్వం 75 వేల నుంచి 80 వేల రూపాయలు అందిస్తోందని నరేంద్రమోదీ గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications