అయోధ్య భూమి పూజపై అసదుద్దీన్ ఫైర్ - ప్రధాని మోదీ హాజరు రాజ్యాంగ విరుద్ధం - అదెప్పటికీ మసీదే..
భారతీయుల ఆరాధ్య దైవం శ్రీరాముడి జన్మభూమిగా పేరుపొందిన అయోధ్యలోని స్థలంలో మందిర నిర్మాణానికి ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. రూ.500 కోట్ల వ్యయంతో అంగరంగ వైభవంగా నిర్మించబోయే ఆలయానికి ఆగస్టు 5న భూమి పూజ జరుగనుంది. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా హాజరై, వెండి ఇటుకలతో శంకుస్థాపన చేయనున్నారు. కాగా, ఈ వ్యవహారంపై హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అనూహ్య వ్యాఖ్యలు చేశారు.

వ్యక్తిగత హోదాలో మాత్రమే..
అయోధ్య భూమి పూజకు ప్రధానమంత్రి హాజరు కావడాన్ని ఓవైసీ తప్పు పట్టారు. ‘‘లౌకికవాద పునాదులపై ఏర్పడిన భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆగస్టు 5న అయోధ్యలో జరిగే రామ మందిరం భూమి పూజకు ప్రధాని హోదాలో ఆయన హాజరైతే అది కచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. వ్యక్తిగత హోదాలో మాత్రమే ఆయనక్కడికి వెళ్లాలి'' అని అసదుద్దీన్ మంగళవారం ట్విటర్ లో పేర్కొన్నారు.

దాన్ని మసీదుగానే చూస్తాం..
ప్రఖ్యాత ‘ఔట్ లుక్' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించిన అసద్.. 400 ఏళ్లుగా అయోధ్యలో ఉన్న బాబ్రీ మసీదును ఓ నేరస్థుల సమూహం 1992లో కూల్చివేసిన సంఘటనను తాము ఎన్నటికీ మర్చిపోలేమని, అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా ఆ చోటును ఎప్పటికీ మసీదుగానే భావిస్తామని, రాబోయే తరాలకు కూడా అదే విషయాన్ని తెలియజేస్తామని అన్నారు.

రాత్రికి రాత్రే విగ్రహాలు..
‘‘1992, డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కూలగొట్టకపోయి ఉంటే మందిరానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదే కాదు. దీనంతటికీ 1949, డిసెంబర్ 22, 23 తేదీల్లో జరిగిన ఘటనలే మూలం. నాడు మసీదులో రాత్రిరాత్రే విగ్రహాలను ప్రతిష్టించారు. అప్పటి ఫైజాబాద్ డిప్యూటీ కమిషనర్ వాటిని తొలగించేందుకు నిరాకరించారు. కాలక్రమంలో ఆయన జనసంఘ్ తరఫున ఎంపీగా గెలిచారు. 1986లో ఓ 50 నిమిషాల పాటు మాత్రమే మసీదును తెరిచారు. 1992లో బాబ్రీ విధ్వంసాన్ని అటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగానీ, ఇటు ప్రధానమంత్రిగానీ అడ్డుకోలేకపోయారు. ముస్లింల దృష్టిలో ఆ చోటు ఎప్పటికీ మసీదుగానే మిగిలిపోతుంది''అని ఔట్ లుక్ ఇంటర్బ్యూలో అసదుద్దీన్ వ్యాఖ్యానించారు.

ఆ చట్టానికి బీజేపీ తూట్లు..
అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ముస్లిం పక్షం అంగీకరించలేదని, అది వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా, విశ్వాసాల ఆధారంగా వచ్చిన తీర్పని ఓవైసీ చెప్పుకొచ్చారు. సుప్రీం తన తుది తీర్పులో.. 1947 నాటికి ప్రార్థనా స్థలాన్ని పరిరక్షించే ‘‘ఆరాధన స్థలాల చట్టం-1991''ని సమర్థించిందని, ఒకవేళ ఆరాధన స్థాలాల చట్టమే లేకపోయి ఉంటే, ‘కాశీ విశ్వనాథ్ ఆలయం-జ్ఞాన్వాపి మసీదు' వివాదం కేసు ఇప్పటికీ కోర్టులలో పెండింగ్ లో ఉండేది కాదని ఎంఐఎం నేత అన్నారు. బీజేపీ అతి త్వరలోనే ‘‘ఆరాధన స్థలాల చట్టం-1991''ను మంటగలిపే ప్రయత్నం చేస్తుందని ‘ఔట్ లుక్' ఇంటర్వ్యూలో అసద్ ఆరోపించారు.

సుప్రీం తీర్పు అమోఘం కాదు..
‘‘ఏది ఏమైనా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మనందరం అంగీకరించాల్సిందే. కానీ ఇక్కడ మనం.. ‘‘సుప్రీం తీర్పు ఎప్పుడైనా అంతిమమే, కానీ ప్రతిసారి అమోఘం కాబోదు''అన్న మాజీ చీఫ్ జస్టిస్ జేఎస్ వర్మ మాటల్ని గుర్తుచేసుకోవాలి. మందిరం, మసీదు అంశంపై నా అభిప్రాయాలతో ఎవరైనా విభేదించొచ్చు. ప్రజాస్వామ్యంలో, నన్ను విమర్శించే హక్కు ప్రజలకు ఉంది. అదే సమయంలో అభిప్రాయాలను బలంగా చెప్పే హక్కు కూడా నాకుంది'' అని అసదుద్దీన్ చెప్పారు.












Click it and Unblock the Notifications