మోడీ బంగ్లా టూర్ కోడ్ ఉల్లంఘనే- ఈసీకి తృణమూల్ కాంగ్రెస్ ఫిర్యాదు
పశ్చిమబెంగాల్లో ఓవైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే బెంగాల్ ఓటర్లను ఆకట్టుకునేందుకు బంగ్లాదేశ్లో ప్రధాని మోడీ పర్యటించడంపై తృణమూల్ కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఇదే అంశంపై తృణమూల్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. బెంగాల్ ఎన్నికల వేళ ప్రధాని మోడీ బంగ్లాదేశ్ పర్యటన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.
బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు బంగ్లాదేశ్లో పర్యటించడం ద్వారా ప్రధాని మోడీ ఎన్నికల కోడ్తో పాటు ప్రజాస్వామ్య నైతిక సూత్రాల్ని ఉల్లంఘించారని తృణమూల్ కాంగ్రెస్ ఈసీకి చేసిన ఫిర్యాదులో పేర్కొంది. ప్రధాని మోడీ బంగ్లాదేశ్లో పర్యటిస్తానంటే తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని, కానీ ఎెన్నికల వేళ పర్యటించడం పలు అనుమానాలకు తావిస్తోందని తెలిపింది. బంగ్లాదేశ్ స్వాతంత్రం వచ్చి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలకూ మోడీకీ ఎలాంటి సంబంధం లేదంది.
బెంగాల్ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్లను ఆకర్షించేందుకే మోడీ బంగ్లాదేశ్లో పర్యటించి వచ్చారని తృణమూల్ కాంగ్రెస్ ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. బెంగాల్లో తొలి దశ ఎన్నికలకు ముందు ప్రధాని మోడీ బంగ్లాదేశ్ వెళ్లి అక్కడి మతువా ఆలయాన్ని దర్శించుకున్నారు. దీనిపైనే టీఎంసీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. బెంగాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో ప్రభావం చూపే మతువా ఓటర్ల కోసమే మోడీ బంగ్లాదేశ్లో పర్యటించారని ఆరోపిస్తోంది.
Trinamool Congress (TMC) registers a complaint with Election Commission over, "Gross violation of democratic ethics and the Model Code of Conduct by Prime Minister during his visit to Bangladesh." pic.twitter.com/S1dDiejAqt
— ANI (@ANI) March 30, 2021