ఉత్తరాఖండ్: మోడీ పాలనపైనే ఖండూరీ అశలన్నీ..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మనోహర పాలనే ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని విజయ తీరాలకు చేరుస్తుందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మేజర్ జనరల్ రిటైర్డ్ బిసి ఖండూరీ ధీమా వ్యక్తంచేశారు.
డెహడ్రూన్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మనోహర పాలనే ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని విజయ తీరాలకు చేరుస్తుందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మేజర్ జనరల్ రిటైర్డ్ బిసి ఖండూరీ ధీమా వ్యక్తంచేశారు. సిఎం అభ్యర్థిగా ఆయన పేరును బిజెపి ఖరారు చేయకున్నాపార్టీ గెలుపు ఖాయమని ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీశ్ రావత్ ఎల్లవేళలా ఇతరుల కంటే తన ప్రయోజనాలే ముఖ్యంగా భావిస్తారని పేర్కొన్నారు.
ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీలోనూ ఇదే ధోరణి ప్రదర్శిస్తారని బిసి ఖండూరీ ఎద్దేవాచేశారు. చివరకు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకు వెళ్లేందుకు అమలుచేసే ఏ నిర్ణయంలోనైనా ఆయన వ్యక్తిగత ప్రయోజనాలే ఇమిడి ఉంటాయని అన్నారు. ఒక ముఖ్యమంత్రిగా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి అప్రతిష్ట తెచ్చి పెట్టారని మండిపడ్డారు. హరీశ్ రావత్ హయం అంతా అవినీతి, కుంభకోణాల మయమని ధ్వజమెత్తారు.
ప్రతి శుక్రవారం ముస్లిం మైనారిటీ ఉద్యోగుల కోసం 90 నిమిషాల బ్రేక్ ఇవ్వడం సిఎం హరీశ్రావత్ ఎన్నికల జిమ్మిక్కు అని బిసి ఖండూరీ వ్యాఖ్యానించారు. భారత్ సౌదీ అరేబియా కాదన్నారు. ముస్లిం మైనారిటీలు కూడా ఆయన ఎన్నికల జిమ్మిక్కుగా భావిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా 24 గంటల్లోపే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నదని, దీనివల్ల బిజెపికి లబ్ది చేకూరిందన్నారు.
తమ పార్టీలో గల అంతర్గత విభేదాలు ఏమాత్రం రాష్ట్రంపై ప్రభావం చూపబోవని ఉత్తరాఖండ్ మాజీ సిఎం బిసి ఖండూరీ చెప్పారు. తమది ఒక కుటుంబం అని, తమకు తాము సరిదిద్దుకోగలమని తెలిపారు. హరీశ్రావత్ ఒక ముఖ్యమంత్రిగా పనితీరు రాష్ట్ర ప్రజలపై చూపలేదన్నారు. ఆయన పనితీరును ప్రజలే నిర్దేశిస్తారని చెప్పారు.

తమ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకపోవడం పార్టీ కేంద్ర నాయకత్వం వ్యూహంలో భాగమని బిసి ఖండూరీ తెలిపారు. అది ఫలిస్తుందా? లేదా? అన్న విషయాన్ని ఎన్నికల ఫలితాలు ఖరారుచేస్తాయని వివరించారు. అన్ని అంశాలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ పనితీరే కొలమానంగా మారుతుందని అన్నారు. కేంద్రంలో ప్రధాని మోడీ పరిపాలన పట్ల రాష్ట్ర ప్రజలు స్ఫూర్తి పొందారన్నారు. పాకిస్థాన్కు వ్యతిరేకంగా సర్జికల్ దాడులు, పెద్ద నోట్లు రద్దుచేస్తూ ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయాలు తమ పార్టీకి సానుకూలంగా మారతాయని ఖండూరీ ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్ర ఏర్పాటుపై పార్టీల పరస్పర ప్రకటనలు
ఉత్తరాఖండ్ రాష్ట్ర ఏర్పాటైన 16 ఏళ్ల తర్వాత ఆ క్రెడిట్ తమదంటే తమదని కాంగ్రెస్, బిజెపి, ఎస్పీ, తదితర పార్టీలు ప్రకటించుకుంటున్నాయి. ఇటీవలే బిజెపి స్థానిక దిన పత్రికల్లో 'అటల్ జీ బనాయా, మోడీ జీ సన్వారేంజె' అనే నినాదంతో పూర్తి పేజీ వాణిజ్య ప్రకటనలు జారీచేశాయి. 2000లో వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారు. తర్వాత రాష్ట్రం పేరు ఉత్తరాఖండ్గా మార్చారు. అటల్ జీ హయాంలో రాష్ట్రం ఏర్పాటు చేశామన్న సంగతి వాస్తవం అని బిజెపి అధికార ప్రతినిధి బిస్త్ వ్యాఖ్యానించారు.
కానీ బిజెపి వాదనను ఇతర పార్టీలు తిరస్కరించాయి. ఉత్తరాఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం 1979లోనే ఉత్తరాఖండ్ క్రాంతిదళ్ (యుకెడి) అనే రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన పార్టీ ఏర్పాటైంది. రాష్ట్ర ఏర్పాటు కోసం 'యుకెడి' పోషించిన చురుకైన పాత్రను ఇతర పార్టీలు జాతీయ స్థాయి పార్టీలు హైజాక్ చేశాయి. రాష్ట్ర ఏర్పాటు హక్కు తమకే సొంతమని యుకెడి పాట్రన్ కాశీసింగ్ అయిరి అన్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భాగస్వామిగా ఉత్తరాఖండ్ రాష్ట్ర ఏర్పాటుకు తొలుత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధినేత ములాయం సింగ్ యాదవ్. అందుకోసం కౌషిక్ కమిటీ సిఫారసులను కూడా ఆమోదించారు. రాష్ట్రాన్ని ఏర్పాటుచేసిన అటల్ బిహారీ వాజ్పేయి ఉత్తరాఖండ్ కు పూర్తిస్థాయి రాజధానిని ఏర్పాటు చేయలేకపోయారని ఎస్పీ రాష్ట్ర చీఫ్ సత్యనారాయణ్ సచాన్ తెలిపారు. రాష్ట్ర ఏర్పాటులో ఎస్పీ పాత్రను వివరిస్తూ కరపత్రాలు, పుస్తకాలు పంపిణీచేస్తామన్నారు. ఉత్తరాఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కిశోర్ ఉపాధ్యాయ్ స్పందిస్తూ తామూ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించామని చెప్పారు. 1993లో ఉత్తరాఖండ్ ఏర్పాటు కోసం నాటి కేంద్రమంత్రి రాజేశ్ పిలోట్జీ చొరవ తీసుకున్నట్లు గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications