'నితీశ్ ఫ్రెండ్, బీజేపీ గీసిన లక్ష్మణ రేఖను దాటలేదు'
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో తనకు చోటుదక్కక పోవడానికి వేరే కారణాలు ఉన్నాయని బీజేపీ ఎంపీ, సీనియర్ నటుడు శత్రుఘ్నసిన్హా అన్నారు. బుధవారం ఆయన ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించారు.
మోడీ కేబినెట్లో చోటు దక్కడానికి అనుభవమే కొలమానం కాదని ఆయన అభిప్రాయపడ్డాడు. బుధవారం ఆయన మాట్లాడుతూ స్నేహాన్ని, మిత్రులను రాజకీయంతో ముడిపెట్టకూడదని అన్నారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ తనకు మంచి మిత్రుడని, మంచి ముఖ్యమంత్రుల్లో ఆయనొకరని కొనియాడారు.
అంతేకాదు, బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నితీశ్ కుమార్ డీఎన్ఏపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు తప్పుడు ఉద్దేశంతో చేశారని తాను భావించడంలేదని అభిప్రాయపడ్డారు. ఆ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీ గీసిన లక్ష్మణ రేఖను తానెన్నడూ దాటలేదని చెప్పారు.
అభివృద్ధి గురించి తాను చాలాసార్లు అరవింద్ కేజ్రీవాల్, నితీశ్ కుమార్లతో మాట్లాడానని చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ యాక్షన్ హీరో అని చెప్పిన శత్రుఘ్నసిన్హా, మోడీ భారత్ను అభివృద్ధి పథంలో నడిపిస్తాడనుకోవడంలో ఎలాంటి సందేహాం లేదన్నారు.
ప్రధాని నరేంద్రమోడీకి తానే నమో టైటిల్ని ఇచ్చానని చెప్పారు. ప్రధాని ముందు చూపుని తాను ఛాలెంజ్ చేయడం లేదని, నన్ను మంత్రిని చేయకపోవడం వల్ల నన్ను గెలిపించిన నా ఓటర్లు ఒకింత కలత చెందారని తెలిపారు. ప్రధాని మోడీ నన్ను ఆహ్వానించలేదు కాబట్టే తాను ర్యాలీలకు హాజరుకాలేదని తెలిపారు.
చివరగా కొసమెరుపు ఏంటంటే శత్రుఘ్నసిన్హా భార్య పూనమ్ సిన్హాను బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ(యూ) తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయించే అవకాశం ఉందని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ వార్తలను శత్రుఘ్నసిన్హా ఖండించారు.