సోమనాథ్ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా శనివారం సోమనాథ్ లో పర్యటించారు. గుజరాత్ లోని ప్రముఖ శైవ క్షేత్రం సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని ప్రధాని నరేంద్రమోదీ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ప్రతిష్టాత్మక 'సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్' వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. సుమారు వెయ్యేళ్ల క్రితం ఈ ఆలయంపై దాడి జరిగింది.
అయితే ఆలయ సంరక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరులను స్మరించుకుంటూ నిర్వహించే శౌర్య యాత్రలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఇదే విషయంపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మన నాగరిక ధైర్యానికి చిహ్నమైన సోమనాథ్ కు వచ్చినందుకు గర్వపడుతున్నానని తెలిపారు. ఈ పర్యటన తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు.
అంతకుముందు రాజ్ కోట్లోని హీరాసర్ విమానాశ్రయంలో ప్రధాని మోదీ దిగారు. ప్రధాని మోదీకి గుజరాత్ మంత్రి కున్వర్ జీ, స్థానిక మేయర్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా సోమనాథ్ ఆలయానికి చేరుకున్నారు. అయితే విమానాశ్రయం నుంచి ఆలయం వరకు రోడ్డుకి ఇరువైపులా వేలాది మంది ప్రజలు బారులు తీరి మోదీకి ఘన స్వాగతం పలికారు. ఇక ఆలయంలో జ్యోతిర్లింగానికి ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో జరిగే 'ఓంకార మంత్ర' జపంలో పాల్గొన్నారు.
అనంతరం జనవరి 8 నుంచి 11 వరకు జరుగుతున్న ఈ 'సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్' వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అలాగే ఆలయంలోనే అద్భుతమైన డ్రోన్ ప్రదర్శనను ప్రధాని మోదీ వీక్షించారు. సోమనాథ్ ఆలయం అద్భుతమైన 3D షో సైతం ప్రదర్శించారు.
ఇక జనవరి 11న ఉదయం ప్రధాని మోదీ 'శౌర్య యాత్ర' లో పాల్గొనున్నారు. సోమనాథ్ ఆలయాన్ని రక్షించే క్రమంలో ప్రాణత్యాగం చేసిన వీరుల స్మారకార్థం ఈ యాత్ర నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 108 గుర్రాలతో భారీ ఊరేగింపు ఉంటుంది. ఇది వారి త్యాగానికి, వీరత్వానికి అద్దం పట్టేలా ఉంటుంది. అలాగే సోమనాథ్ లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించి ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.

అలాగే జనవరి 12న ప్రధాని షెడ్యూల్ అహ్మదాబాద్ లో కొనసాగనుంది. జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ తో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. అలాగే ఇరువురు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత సబర్మతి రివర్ ఫ్రంట్ వద్ద జరిగే అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ లో పాల్గొంటారు.












Click it and Unblock the Notifications