గరిటె తిప్పిన ప్రధాని మోదీ
PM Narendra Modi: ఏపీలో పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు రాష్ట్రంలో గల 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ మొదలైంది. సాయంత్రం వరకు కొనసాగుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సహా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఏపీ, తెలంగాణ కలుపుకొని నాలుగో విడతలో దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో నేడు ఓటింగ్ కొనసాగుతోంది. బిహార్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్లల్లో మొత్తంగా 96 లోక్సభ స్థానాలకు పోలింగ్ జోరుగా సాగుతోంది.

పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల, కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను పూర్తి చేశారు. పోలింగ్ స్టేషన్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండటానికి అవసరమైన అన్ని చర్యలను యుద్ధ ప్రాతిపదికన తీసుకున్నారు.
ఈ పరిస్థితుల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిహార్ రాజధాని పాట్నాలో పర్యటించారు. గురుద్వారా పాట్నా సాహిబ్ను సందర్శించారు. సిక్కుల మత గురువు గురునానక్కు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సుమారు అరగంటకు పైగా ప్రార్థనల్లో గడిపారాయన. ఆ సమయంలో కాషాయం తలపాగాతో కనిపించారు మోదీ. గురుద్వారాకు వచ్చిన మోదీని సిక్కు ప్రముఖులు సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం సిక్కుల ప్రసాదం లంగర్ను స్వయంగా వండారు. గరిటె తిప్పారు. వంట పూర్తయిన తరువాత లంగర్ ప్రసాదాన్ని అల్పాహారంగా భక్తులకు స్వయంగా వడ్డించారు. రుచి గురించి అడిగి తెలుసుకున్నారు. స్వయంగా తమను వడ్డిస్తోన్న మోదీని ఫొటోలు తీయడానికి, ఆయనతో సెల్ఫీ దిగడానికి భక్తులు ఎగబడ్డారు.












Click it and Unblock the Notifications