మోడీతో శరద్ పవార్ భేటీ-రాష్ట్రపతి పోస్టుకు లాబీయింగ్ ? లేదు లేదంటూనే
ఎన్సీపీ అధినేత, రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ రాష్థ్రపతి పదవి అభ్యర్ధిత్వం కోసం లాబీయింగ్ ముమ్మరం చేశారు. ఇప్పటికే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో రెండుసార్లు భేటీ అయి చర్చలు జరిపిన పవార్.. ఇవాళ ప్రధాని మోడీని కలుసుకున్నారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీ 50 నిమిషాల పాటు సాగింది.
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తో శరద్ పవార్ భేటీలో ఏయే అంశాలు చర్చకు వచ్చాయన్న అంశంపై వివరాలు బయటికి రాలేదు. అయితే రాష్టపతి పదవికి అభ్యర్ధిగా తనకు మద్దతివ్వాలని శరద్ పవార్ పలు పార్టీల్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో పాటు పలు బీజేపీయేతర పార్టీల అధినేతలతో ఇప్పటికే భేటీ అయిన పవార్ తన మనసులో మాట చెప్పినట్లు తెలుస్తోంది. బీజేపీయేతర పార్టీల మద్దతు సంపాదించిన పవార్.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్ వద్దకు తమ దూతగా ప్రశాంత్ కిషోర్ ను పంపినట్లు తెలుస్తోంది.
ఇవాళ ప్రధాన మంత్రి మోడీతో జరిగిన భేటీలో ఎన్డీయే అభ్యర్ధిగా తనకు మద్దతివ్వాలని లేదా యూపీఏ అభ్యర్ధిగా నిలబడితే మద్దతివ్వాలని కానీ పవార్ కోరినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఇఫ్పటికే తన రాష్ట్రపతి అభ్యర్ధిత్వానికి సంబంధించి వస్తున్న ఊహాగానాల్ని పవార్ తోసిపుచ్చడం విశేషం. అటువంటప్పుడు కీలక నేతలతో పవార్ భేటీలు ఎందుకోసమన్న చర్చ జరుగుతోంది. ప్రధానితో సుదీర్ఘ చర్చ తర్వాత పవార్ స్పందించకుండా వెళ్లిపోయినప్పటికీ ఆయన లాబీయింగ్ మాత్రం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.