అజెండా లేనివారే ఇతరుల తల్లుల గురించి మాట్లాడుతారు: కాంగ్రెస్పై మోడీ ఫైర్
మధ్యప్రదేశ్ : రాజకీయాల్లోకి తన తల్లిని తీసుకురావడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ప్రధాని నరేంద్రమోడీ. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశంలో రూపాయి విలువ మోడీ తల్లి వయస్సుతో పాటే పడిపోతోందంటూ కాంగ్రెస్ నేత రాజ్బబ్బర్ చేసిన వ్యాఖ్యలపై ధీటుగా సమాధానం ఇచ్చారు మోడీ. ఎన్నికలకు ఒక అజెండా అంటూ లేనివారే ఇతరుల వ్యక్తిగత విషయాలు తల్లుల గురించి మాట్లాడుతారని ప్రధాని కౌంటర్ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ తనతో పోటీకి రాలేకపోవడమే కాదు కనీసం అభివృద్ధిపై చర్చ చేసేందుకు కూడా సాహసం చేయలేదని మోడీ అన్నారు. అందుకే తన తల్లిని రాజకీయాల్లోకి లాగుతున్నారని మోడీ విమర్శించారు.ఇలాంటి దిగజారుడు రాజకీయాలను సహించబోనని ప్రధాని అన్నారు. తన తల్లికి రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియవన్న సంగతి తెలిసినప్పటికీ కాంగ్రెస్ వారు ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. ఇప్పటికీ మధ్యప్రదేశ్ ప్రజలు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను మామా అని పిలవడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందన్నారు.
కాంగ్రెస్ వారి మామలు బోఫోర్స్ స్కామ్లో నిందితులుగా ఉన్న ఇటలీ పారిశ్రామికవేత్త కతురోచి మరియు భోపాల్ గ్యాస్ ఘటనకు మూలకారకుడైన వారెన్ అండర్సన్లు అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్కు ఓటువేస్తే అభివృద్ధి అంధకారంలోకి పోతుందని మోడీ అన్నారు. 230 అసెంబ్లీ సీట్లున్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 28న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 11న వెలువడుతాయి.