తన పదవికి రాజీనామా చేసిన ప్రధాని మోదీ
PM Modi resignation: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేశారు. ఈ రాజీనామా పత్రాన్ని ముర్ము తక్షణమే ఆమోదించారు. ఆయన రాజీనామాతో మంత్రి వర్గం మొత్తం రద్దయింది. కేంద్ర మంత్రులందరూ మాజీలు అయ్యారు.
కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యేంత వరకు ఆపద్ధర్మ ప్రధానిగా ఉండాలని ద్రౌపది ముర్ము.. మోదీని కోరారు. దీనికి ఆయన అంగీకరించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడేంద వరకూ మోదీ ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారు.

లోక్సభ ఎన్నికలు ముగిసిన తరువాత దేశంలో రాజకీయ పరిణామలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. ప్రత్యేకించి- కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారనేది చర్చనీయాంశమౌతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏకు బొటాబొటి మెజారిటీ సీట్లు లభించడం, ఓట్ల లెక్కింపు తరువాత కూటమిలో లుకలుకలు ఏర్పడటం శరవేగంగా సాగిపోయాయి.
ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎన్డీఏ సంకీర్ణ కూటమికి 292 సీట్లు లభించాయి. 400లకు పైగా సీట్లను సాధిస్తామంటూ లోక్సభ ఎన్నికల ప్రచార సమయంలో ధీమాగా చెప్పిన బీజేపీ నాయకులు.. ఓట్ల లెక్కింపు సందర్భంగా వెలువడిన ఫలితాలతో డీలా పడ్డారు. బీజేపీకి అత్యంత బలమైన ఉత్తరప్రదేశ్లో సైతం ఉమ్మడి ప్రతిపక్షాల కూటమి ఇండియా హవా వీచింది.
ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి 234 స్థానాలు లభించాయి. ఇతరులు 17 చోట్ల గెలిచారు. అయినప్పటికీ- ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ను ప్రస్తుతానికి అందుకోలేకపోయిందీ ఇండియా అలయెన్స్. అదే సమయంలో ఎన్డీఏకు ఈ అవకాశం లభించింది.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ స్థానాలు లభించిన నేపథ్యంలో ఈ నెల 8వ తేదీన మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తన మెజారిటీని ఆయన నిరూపించుకోవాల్సి ఉంటుంది.
అటు ఎన్డీఏలో అసంతృప్తిగా ఉన్న భాగస్వామ్య పార్టీలు- ముఖ్యంగా బిహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీష్ కుమార్ తమవైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా సైతం ప్రయత్నాలు సాగిస్తోంది. నితీష్ కుమార్ 12 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఆయనతో పాటు గెలిచిన ఇతరులు 17 మందితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది ఇండియా యోచన.












Click it and Unblock the Notifications