CBSE పరీక్షల రద్దు వ్యవహారం: ప్రధాని మోడీ జోక్యం: కాస్సేపట్లో కీలక ప్రకటన
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహించే వార్షిక పరీక్షల గడువు ముంచుకొస్తోంది. వచ్చేనెలలో 10వ తరగతి, ఆపై పరీక్షలను నిర్వహించడానికి అధికార యంత్రాంగం సమాయాత్తమౌతోంది. అదే సమయంలో ప్రాణాంతక కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో కనివినీ ఎరుగని రీతిలో పుట్టుకొస్తోండటం తల్లిదండ్రుల్లో తీవ్ర భయాందోళనలకు కారణమౌతోంది. పరీక్షలను రాయడానికి సిద్దపడుతోన్న విద్యార్థులనూ కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ పరిస్థితుల్లో సీబీఎస్ఈ పరీక్షలను రద్దు చేయాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. ఈ దిశగా పలు రాజకీయ పార్టీలు కేంద్రానికి విజ్ఙప్తులను పంపిస్తున్నాయి.
ఈ పరిణామాల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ అధికారులతో సమావేశం కానున్నారు. ఇంకాస్సేపట్లో ఈ సమావేశం ఆరంభం కానుంది. కేంద్రమంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, ఆ శాఖ కార్యదర్శి, కొందరు కీలక అధికారులతో ప్రధాని భేటీ కాబోతున్నారు. సీబీఎస్ఈ పరీక్షలను నిర్వహించాలా? వద్దా? అనే విషయంపై కాస్సేపట్లో కీలక ప్రకటన వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది. సీబీఎస్ఈ బోర్డు పరీక్షలను వాయిదా వేయాలా? లేక విద్యార్థులను ప్రమోట్ చేయాలా? అనే పలు అంశాలు ఈ భేటీ సందర్భంగా ప్రస్తావనకు వస్తాయని తెలుస్తోంది.

విద్యార్థులను ప్రమోట్ చేయాల్సి వస్తే.. వారికి మార్కులను కేటాయించడానికి దేన్ని ప్రాతిపదికగా, ప్రామాణికంగా తీసుకుంటారనేది ఈ సమావేశంలో ఖరారు చేస్తారు. అలాగే- ఆన్ లైన్ ద్వారా వార్షిక పరీక్షలను నిర్వహించడానికి అందుబాటులో గల మార్గాలపైనా ఈ సమావేశంలో చర్చిస్తారని సమాచారం. ఆన్లైన్ ద్వారా పరీక్షలను నిర్వహించాల్సి వస్తే.. దానికి తగిన వనరులు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వద్ద ఉన్నాయా? లేవా? అనే విషయం ఇక్కడ కీలకంగా మారుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లను తప్పనిసరిగా వినియోగించాల్సి ఉంటుంది.
ఇంటర్నెట్ సౌకర్యం సమర్థవంతంగా అందుబాటులో ఉండాల్సిన అవసరమూ ఉంది. వాటన్నింటినీ బేరీజు వేసుకుంటూ ప్రధానమంత్రి సీబీఎస్ఈ బోర్డు పరీక్షల నిర్వహణ మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇంకాస్సేపట్లో తేలిపోతుంది. దేశవ్యాప్తంగా 1,84,372 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చిన కొద్దిసేపటికే ప్రధానమంత్రి.. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వాయిదా లేదా రద్దు వైపే మొగ్గు చూపొచ్చని అంటున్నారు.












Click it and Unblock the Notifications