ఈ నెల 27న ప్రధానమంత్రి హెల్త్ మిషన్ ప్రారంభం-హెల్త్ కార్డులు-ఒక్క క్లిక్ తో ప్రొఫెల్ రెడీ
దేశవ్యాప్తంగా ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం జాతీయ స్ధాయిలో డిజిటల్ హెల్త్ మిషన్ అమలుకు సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ పేరుతో అమలు చేసే ఈ కార్యక్రమాన్ని ఈ నెల 27న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించబోతున్నారు. ఇందులో ప్రతీ పౌరుడికీ హెల్త్ కార్డుల జారీతో పాటు వారి ఆరోగ్య సమాచారాన్ని అందులో నిక్లిప్తం చేయబోతున్నారు.
దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ అమలు చేయబోతున్నట్లు గత ఏడాది ఆగస్టు 15న ప్రధాని మోడీ ప్రకటించారు. ఇందులో భాగంగా దేశంలోని పౌరులందరికీ హెల్త్ కార్డులతో పాటు హెల్త్ ఐడీ కూడా అందిస్తారు. దీని ఆధారంగా ప్రతీ ఒక్కరి ఆరోగ్య సమాచారాన్ని అందులో నిక్షిప్తం చేస్తారు. భవిష్యత్తులో ఎప్పుడైనా జబ్బు చేసినప్పుడు చికిత్స అందించాల్సి వచ్చినా, మందులు తీసుకోవాల్సి వచ్చినా దానికి ఈ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ఉపయోగపడుతుంది.
జాతీయ డిజిటల్ హెల్త్ మిషన్ లో భాగంగా అమలు చేసే ఈ కార్యక్రమాన్ని ముందుగా పైలట్ విధానంలో ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలు చేయబోతున్నారు. ఇందులో పుదుచ్చేరి, చండీఘడ్, లడఖ్, లక్షద్వీప్, అండమాన్, నికోబార్ దీవులు, డామన్ ,డయ్యూ, దాద్రానగర్ హవేలీలో అమలు చేస్తారు. ఆ తర్వాత దేశంలోని మిగిలిన కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు విస్తరిస్తారు. దీంతో క్రమంగా డిజిటల్ హెల్త్ మిషన్ సేవలు దేశవ్యాప్తంగా అందుబాటులోకి రాబోతున్నాయి.

ఈ నెల 27న ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ హెల్త్ మిషన్ ను ప్రారంభించబోతున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ భాయ్ మాండవీయ వెల్లడించారు. ఈ కార్యక్రమం కింద ప్రతీ ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ఐడీ అందిస్తామన్నారు. ఇందులో సదరు వ్యక్తికి సంబంధించిన పూర్తి ఆరోగ్య సమాచారం ఉండేలా చూస్తామన్నారు. మరోవైపు కోవిడ్ వ్యాప్తి, తీవ్రతను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలంలో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది నియామకాలు, లభ్యత పెంచేలా చర్యలు తీసుంకుంటున్నట్లు మంత్రి మన్సుఖ్ మాండవీయ ఇవాళ ట్వీట్ చేశారు.
కరోనా యొక్క కనీస దుష్ప్రభావాలను నిర్ధారించడానికి చురుకైన, సమగ్ర చికిత్స అవసరమని ఆరోగ్య మంత్రి తెలిపారు.మ్యుకోర్మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) కేసుల్లో ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్లు తీసుకోవడం వలన కోవిడ్ -19 అనంతర ప్రభావాల యొక్క పరిణామాలను రోగులలో చూస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తక్కువ లేదా అతితక్కువ దుష్ప్రభావాలతో ఔషధాలను తీసుకోవడం చాలా ముఖ్యమన్నారు. ముందుగా అప్రమత్తంగా ఉండటం వల్లే కోవిడ్ వ్యాప్తిని నియంత్రించగలిగామన్నారు.
ప్రస్తుతం సమాజంలో కొనసాగుతున్న కోవిడ్ అవగాహనలు-భయం, మానసిక ఆరోగ్య సమస్యలు ముఖ్యమైనని, వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని మంత్రి వివరించారు.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు ఆరోగ్య పథకాలను అమలు చేస్తున్నా పౌరుల పూర్తిస్ధాయి ఆరోగ్య డేటా మాత్రం అందుబాటులో ఉండటం లేదు. దీంతో డాక్టర్లు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది. దీన్నుంచి వారిని బయటపడేసేందుకు, వేగంగా చికిత్స అందించేందుకు వీలుగా కేంద్రం డిజిటల్ హెల్త్ మిషన్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల దీర్ఘకాలంలో ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications