జమ్మూకశ్మీర్ నేతలతో 24న ప్రధాని భేటీ- రాష్ట్ర హోదా పునరుద్ధరణతో ఎన్నికలకు లింక్ ?
రెండేళ్ల క్రితం జమ్మూకశ్మీర్కు ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర హోదా కూడా తొలగించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా అక్కడి నేతలతో చర్చలకు సిద్ధం అవుతుండటం చర్చనీయాంశమవుతోంది. ఈ నెల 24న ప్రధాని మోడీ జమ్మూకశ్మీర్కు చెందిన అఖిలపక్ష నేతల్ని చర్చలకు ఆహ్వానించారు. అయితే ఈ చర్చల్లో తిరిగి రాష్ట్ర హోదా ఇవ్వడంపై మాట్లాడతారా లేక ఎన్నికలపై చర్చిస్తారా అన్నది తేలడం లేదు. దీంతో ప్రధాని మోడీ అఖిలపక్షంతో జరిగే భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంటోంది.
జమ్మూకశ్మీర్ నేతలతో కేంద్రం చర్చలు
రెండేళ్ల క్రితం జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదా తొలగించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా అక్కడి నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. సుదీర్ఘకాలం కేంద్రంపై అక్కడి నేతలు ఆగ్రహంగా ఉండటం, ప్రజ్లలో సైతం భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో తిరిగి అక్కడి ప్రజలు, నేతల్లో విశ్వాసం నింపడమే లక్ష్యంగా కేంద్రం చర్చలు నిర్వహిస్తోంది. తాజాగా హోంమంత్రి అమిత్షా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ఝాతో పాటు ఇతర అధికారులతో సమావేశమయ్యారు. దీనికి కొనసాగింపుగా ప్రధాని మోడీ ఈ నెల 24న జమ్మూకశ్మీర్ అఖిలపక్ష నేతలతో సమావేశమవుతున్నారు.
జమ్మూకశ్మీర్పై పునరాలోచనలో కేంద్రం ?
తీవ్రవాదాన్ని నిర్మూలించే లక్ష్యంతో రెండేళ్ల క్రితం ఆర్భాటంగా జమ్మూకశ్మీర్ను విడగొట్టడంతో పాటు ప్రత్యేక హోదా, రాష్ట్ర హోదా కూడా రద్దు చేసిన కేంద్రానికి అనతికాలంలోనే అక్కడి పరిస్ధితులు తెలిసొచ్యాయి. ముఖ్యంగా ప్రజల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తితో పాటు అక్కడి అన్ని పార్టీలు కలిసి గుప్కార్ అలయన్స్గా ఏర్పడటం, కేంద్రం హోదా పునరుద్ధరించేవరకూ పోరాటడతామని చేస్తున్న ప్రకటనలు కేంద్రాన్ని పునరాలోచనలో పడేశాయి. దీంతో చర్చలకు కేంద్రం మొగ్గుచూపుతోంది.
అసెంబ్లీ ఎన్నికలకు ప్లాన్
జమ్మూకశ్మీర్ను మూడు భాగాలుగా విడగొట్టిన తర్వాత అక్కడ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం దృష్టిపెడుతోంది. ఇది పూర్తయితే కానీ అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. దీంతో కేంద్రం ముందుగా ఈ ఏడాదిలోపే పునర్విభజన పూర్తి చేయాలని పట్టుదలగా ఉంది. కానీ అక్కడి స్దానిక పార్టీల సహకారం లేకుండా పునర్విభజన జరిగే అవకాశం లేదు. దీంతో ప్రధాని మోడీ అక్కడి అఖిలపక్ష నేతల్ని ఈ నెల 24న భేటీకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. పునర్విభజన పూర్తయితే ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ లేదా వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్లో దశల వారీగా ఎన్నికల నిర్వహణకు కేంద్రం సిద్దమవుతోంది.
జమ్మూ కశ్మీర్కు తిరిగి రాష్ట్ర హోదా ?
జమ్మూకశ్మీర్లో తీవ్రవాదాన్ని రూపుమార్పే పేరుతో విభజించు-పాలించు సిద్ధాంతాన్ని ప్రయోగించిన కేంద్రం..ఇప్పుడు విభజన తర్వాత అన్ని పార్టీలు ఏకం కావడంతో ఆత్మరక్షణలో పడింది. దీంతో ఓవైపు ఎన్నికలకు ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు రాష్ట్ర హోదా పునరుద్ధరణకు సై అంటోంది. పైకి చెప్పకపోయినా రేపు ప్రధానితో జరిగే అఖిలపక్ష నేతల భేటీలో ఈ ప్రతిపాదన వారి ముందు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అఖిలపక్ష నేతలంతా రాష్ట్ర హోదా పునరుద్ధరణ కోరుతున్న నేపథ్యంలో వారి డిమాండ్ను అంగీకరిస్తూనే ఎన్నికలకు సహకరించాలని ప్రధాని కోరే అవకాశాలున్నాయి.
Recommended Video