అన్ ప్లాన్డ్.. అన్ షెడ్యూల్డ్: రక్షణ మంత్రికి కూడా చెప్పకుండా.. అక్కడికి వెళ్లిన మోదీ
PM Modi at Adampur Air Base: భారత్- పాకిస్తాన్ మధ్య కొనసాగిన యుద్ధం, శతృదేశ సైనికుల నుంచి ఎదుర్కొన్న ప్రతిదాడులు, మోర్టార్ షెల్స్ కాల్పుల మధ్య ఆందోళనకర వాతావరణం నెలకొన్న జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు సర్దుకుంటోన్నాయి. సాధారణ జనజీవనం ఏర్పడుతోంది. ప్రజలు తమ రోజువారీ పనుల్లో నిమగ్నమౌతోన్నారు.
ఈ పరిస్థితుల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హఠాత్తుగా పంజాబ్లో పర్యటిస్తోన్నారు. అక్కడి ఆదమ్పూర్ ఎయిర్ బేస్ను సందర్శించారు. ఎయిర్ వారియర్లతో భేటీ అయ్యారు. పాకిస్తాన్తో యుద్ధ వాతావరణం, సీజ్ ఫైర్ తరువాత నెలకొన్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. వారి ధైర్య సాహసాలను ప్రశంసించారు. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు.

నిజానికి ఇది అన్ ప్లాన్డ్ ప్రోగ్రామ్. నేటి ప్రధాని షెడ్యూల్లో ఆదమ్పూర్ ఎయిర్ బేస్ స్టేషన్ సందర్శన లేదు. పైగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు కూడా దీనిపై ముందస్తు సమాచారం లేదని తెలుస్తోంది. అప్పటికప్పుడు ఆదమ్పూర్ ఎయిర్ బేస్ స్టేషన్ను సందర్శించాలని భావించారని, దీనితో రోజువారీ షెడ్యూల్లో మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చిందని సమాచారం.
భారత్- పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరిన రెండో రోజే ప్రధాని మోదీ ఆదమ్పూర్ ఎయిర్ బేస్ స్టేషన్ను సందర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీజ్ ఫైర్ తరువాత దేశ ప్రజలను ఉద్దేశించి సైతం ఆయన టీవీలో మాట్లాడారు. చెప్పదలచుకున్నది సూటిగా చెప్పేశారు.
పూర్తిగా ఉగ్రవాదంపైనే సాగిందాయన ప్రసంగం మొత్తం కూడా. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే పాకిస్తాన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమనీ తేల్చి చెప్పారు. ముఖం పగులగొట్టేలా సమాధానం ఇస్తామనీ స్పష్టం చేశారు. భారత్పై ఉగ్రదాడి జరిగిందంటే ముఖం పగిలే సమాధానం ఇస్తామని హెచ్చరించారు.
ఉగ్రవాద చేష్టలపై ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. ఉగ్ర, అణు బెదిరింపులు మున్ముందు చెల్లబోవనీ పేర్కొన్నారు మోదీ. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం, న్యూక్లియర్ బ్లాక్ మెయిలింగ్కు కాలం చెల్లిందని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో పాకిస్తాన్ అనుసరిస్తోన్న విధానాలు, వైఖరిని మోదీ ఎండగట్టారు. ఉగ్రవాదులు అణ్వాయుధాల వెనుక నక్కినా గురిచూసి కొడతామని తేల్చి చెప్పారాయన.

ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తున్న దేశాలు, ఉగ్రవాదులనూ వేరుగా చూడబోమని, ఉగ్రవాదానికి కొమ్ము కాస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వం, ఆ దేశ సైన్యం ఏదో ఒకరోజు దానికే బలి అవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పాకిస్తాన్కు హెచ్చరికలను జారీ చేశారు. భవిష్యత్తులో ఎలాంటి కవ్వింపు చర్యలను సహించబోమనీ అన్నారు.
ఆ మరుసటి రోజే- ప్రధాని మోదీ ఆదమ్పూర్ ఎయిర్ బేస్ స్టేషన్ను సందర్శించారు. వైమానిక దళంతో మాట్లాడారు. వారితో ముచ్చట్లు పెట్టారు. సెల్ఫీ దిగారు. వారి భుజాలపై చేతులు వేసి, ఆప్యాయంగా పలకరించారు. చిరునవ్వులు చిందిస్తూ ఉత్సాహంగా గడిపారు. వారు ఎదుర్కొన్న అనుభవాల గురించి అడిగి తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications