రాజకీయ గురువు ఇంటికెళ్లిన ప్రధాని మోదీ - టీ, టిఫిన్ అక్కడే..!!
అహ్మదాబాద్: గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. పోలింగ్ గడువు సమీపిస్తోన్న అన్ని పార్టీలు కూడా తమ ప్రచార జోరును పెంచుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం కావడం వల్ల- అందరి దృష్టీ ఈ ఎన్నికలపైనే నిలిచింది. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ విస్తృత ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ దీనికి ఏ మాత్రం తీసిపోని విధంగా ప్రచార ఉధృతిని కొనసాగిస్తోన్నాయి.
రెండు దశల్లో..
గుజరాత్లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఇదివరకే నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 1వ తేదీన 89, 5వ తేదీన మిగిలిన 93 స్థానాలకు పోలింగ్ను షెడ్యూల్ చేసింది. మొత్తం 4,90,89,765 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అదే నెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా అదే రోజు వెలువడతాయి.
అద్వానీ ఇంటికి..
ఈ పరిణామాల మధ్య ప్రధాని మోదీ.. తన రాజకీయ గురువు లాల్ కృష్ణ అద్వానీ ఇంటికెళ్లారు. ఇవ్వాళ ఆయన 95వ పుట్టినరోజు. ఈ సందర్భంగా- దేశ రాజధాని లోధీ ఎస్టేట్ పృథ్వీరాజ్ రోడ్లో గల అద్వానీ ఇంటికి వెళ్లారు. పుష్పగుచ్ఛం అందించి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చాలాసేపు ఆయనతో గడిపారు. అక్కడే ఉన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి అల్పాహారాన్ని స్వీకరించారు.
గుజరాత్ రాజకీయాలపై..
ఈ సందర్భంగా పలు అంశాలు వారిద్దరి మధ్య చర్చకు వచ్చాయి. ప్రత్యేకించి- గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తీరుతెన్నులను అద్వానీ అడిగి తెలుసుకున్నట్లు చెబుతున్నారు. గుజరాత్లో పార్టీ ఘన విజయానికి ఎలాంటి ఢోకా ఉండబోదని మోదీ ఆయనకు హామీ ఇచ్చినట్లు సమాచారం. కాగా- అద్వానీ జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ సీనియర్ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
విషెస్ తెలిపిన కేంద్రమంత్రులు..
ప్రధాని రాక కంటే ముందే రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్- అద్వానీ ఇంటికి వెళ్లారు. పుష్పగుచ్ఛాన్ని అందించారు. శాలువా కప్పి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. అద్వానీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఉప ప్రధానిగా దేశాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేశారని అన్నారు. కేంద్రమంత్రులు హర్దీప్ సింగ్ పురీ, రాజీవ్ చంద్రశేఖర్, కిరణ్ రిజిజు తదితరులు అద్వానీకి బర్త్డే విషెస్ తెలిపిన వారిలో ఉన్నారు.