మోడీకి నేనంటే గిట్టదు: అన్నాహజారే, మీకే చెప్తాం: రాహుల్ పోస్ట్పై సోనియా
న్యూఢిల్లీ: అన్నాహజారే గురువారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి నేను అంటేనే ఇష్టముండదని, అందుకే తన సూచనలు, సలహాలు తీసుకునేందుకు ఇష్టపడడని వ్యాఖ్యానించారు. ల్యాండ్ బిల్లును అన్నా హజారే వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
లోకసభ ఎన్నికల సమయంలో తాను ప్రధాని నరేంద్ర మోడీని, ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీలకు వ్యతిరేకంగా మాట్లాడానని, వారు పారిశ్రామికవేత్తలకు అనుకూలమని అప్పుడు విమర్శించానని, అందుకే వారికి తానంటే గిట్టదని, అందుకే మోడీ తన సూచనలు తీసుకోరని హజారే అన్నారు.
కేంద్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉందని ఆరోపించారు. రైతుల భూములను బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తోందన్నారు. ల్యాండ్ బిల్లులో కొన్ని సవరణలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ బిల్లు పైన త్వరలో ఓ టీంను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
రాహుల్ గాంధీకి పగ్గాలిస్తే తెలిసేది మీకే: సోనియా
రాహుల్ గాంధీ ఏప్రిల్ నెలలో ఏఐసీసీ పగ్గాలు కట్టబెడతారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీని పైన సోనియా గాంధీ స్పందించారు. రాహుల్ పార్టీ అధ్యక్షుడు అయినప్పుడు ఆ విషయం మీకు తెలియజేస్తామని మీడియాతో అన్నారు. మరోవైపు, సోనియా, రాహుల్ మధ్య విభేదాలు తలెత్తినట్లు వచ్చిన వార్తలను కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చింది. సోనియా, రాహుల్ సమన్వయంతో పార్టీని నడిపించడం తమకెంతో ఆనందంగా ఉందని పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ గౌడ అన్నారు.