అత్తను మించిన కోడలు, ఇందిరా, సోనియాను ఏకేసిన మోడీ: ప్రధాని కుర్చీ మీద ఆశ, రూ. 100 కోట్లు!
చిక్కమగళూరు: కాంగ్రెస్ పార్టీకి దేశ ప్రజలకంటే వంశపారంపర్య రాజకీయాల మీద ఎక్కవ ఆసక్తి అని, నెహ్రు నుంచి నేటి వరకు వారు కుటుంబ సభ్యుల పదవుల మీద ఆసక్తి చూపించారని, ప్రధాని కుర్చీ మీద ఆశ ఎక్కువని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. చిక్కమగళూరులో బీజేపీ ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకులను ఏకిపారేశారు. ఇందిరా గాంధీ, సోనియా గాంధీని కన్నడిగులు గెలిపిస్తే తరువాత ఇటు వైపు కన్నెత్తి చూడలేదని మోడీ ఆరోపించారు.
ఇందిరా గాంధీని గెలిపించారు
1978లో ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపోయిందని, ఆ సందర్బంలో ఇందిరా గాంధీ చిక్కమగళూరు నుంచి పోటీ చేస్తే మీరు గెలిపించారని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు చేశారు. ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచి వెళ్లిన ఇందిరా గాంధీ తరువాత ఇటు వైపు కన్నెత్తి చూడలేదని, ఇలాంటి కాంగ్రెస్ పార్టీని మీరు మళ్లీ ఆదరిస్తారా అని ప్రధాని మోడీ స్థానిక ప్రజలను ప్రశ్నించారు.
అత్తను మించిన కోడలు
అత్త ఇందిరా గాంధీని మించిన కోడలు సోనియా గాంధీ అని ప్రధాని నరేంద్ర మోడీ ఎద్దేవ చేశారు. 1999లో బళ్లారి నుంచి పోటీ చేసిన సోనియా గాంధీని స్థానికులు గెలిపించారని, రూ. 3,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ఆమె తరువాత అటు వైపు తిరిగి చూడలేదని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. వారికి అధికారం ముఖ్యం, ప్రజల కష్టాలు గుర్తించడానికి సమయం ఉండదని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు.
సుప్రీం, సీబీఐ, సైన్యం
దేశంలో కాంగ్రెస్ ఒక్కటే నిజాయితీగా ఉందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. సీజేఐ, సీబీఐ, ఎన్ఐఏ మీద నమ్మకం లేదని, చివరికి సైన్యం పనితీరు మీద ఆ పార్టీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తూ సాక్షాలు అడుగుతున్నారని, అంత నీచానికి దిగజారిపోయారని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు.
ఈవీఎంలు, ఎన్నికల సంఘం
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓడిపోతామని గ్రహించి ఇప్పుడు ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చెయ్యాలని మాస్టర్ ప్లాన్ వేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రపంచలోనే భారత ఎన్నికల సంఘం తీరు నెంబర్ వన్ గా ఉందని, అలాంటి ఎన్నికల సంఘం మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తూ దేశం పరువు తీస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు.
రైతుల జీవితాలతో ఆటలు
వక్కలు ఆరోగ్యానికి హానికరం అని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టులో అర్జీ సమర్పించారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. చిక్కమగళూరుతో సహ చుట్టుపక్కల జిల్లాల్లోని వక్క చెట్ల పెంపకం రైతు జీవితాలతో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెలగాటం ఆడుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు.
రూ. 100 కోట్లు, బంగారు
కర్ణాటకలో ఎన్నికల సందర్బంగా రూ. 100 కోట్ల, బంగారు నాణ్యాలు చిక్కాయని, కాంగ్రెస్ పార్టీ అక్రమ మార్గంలో అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. బాదామిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి చెందిన రిసార్టులో లక్షల రూపాయల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారని ప్రధాని మోడీ ఆరోపించారు.
లీగల్ నోటీసుకు బెదరని మోడీ
తనను సీదా రూపయ్య అని విమర్శించిన ప్రధాని నరేంద్ర మోడీకి సిద్దరామయ్య లీగల్ నోటీసులు పంపించి రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. అయితే చిక్కమగళూరులో మళ్లీ ప్రధాని నరేంద్ర మోడీ సీదా రూపయ్య బాదామిలో ఎలాగైనా గెలవాలని విచ్చల విడిగా డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్దం అయ్యారని ఆరోపించారు.