ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, విజయం మాదే, ధీమా !
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం గుజరాత్ లో 150 కిలోమీటర్ల దూరం సముద్ర విమానంలో ప్రయాణించారు. గుజరాత్ లోని సబర్మతి నదిలో సముద్ర విమానంలో ప్రయాణించిన ప్రధాని నరేంద్ర మోడీ ధారోయ్ డ్యామ్ కు చేరుకున్నారు.
మోడీ ప్రత్యేక పూజలు
ధారోమ్ డ్యామ్ దగ్గర నుంచి రోడ్డు మార్గంలో అంబాజీ ప్రయాణించిన ప్రధాని నరేంద్ర మోడీ అంబా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గుజరాత్ శాసన సభ రెండో దశ పోలింగ్ జరగడానికి రెండు రోజుల ముందు ప్రధాని నరేంద్ర మోడీ, స్థానిక బీజేపీ నాయకులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
జగన్నాథ్ ఆలయంలో రాహుల్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టనున్న రాహుల్ గాంధీ మరోసారి గుజరాత్లో ఆలయాలు సందర్శించారు. ప్రధానంగా అహ్మదాబాద్లోని ప్రఖ్యాత జగన్నాథ్ ఆలయాన్నిరాహుల్ గాంధీ మంగళవారం సందర్శించారు.
స్వామివారి పూలమాల, శాలువా
కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ జగన్నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్నాథ్ ఆలయ అధికారులు, ప్రధాన అర్చకులు రాహుల్ గాంధీకి స్వామివారి పూలమాలు, శాలువా బహూకరించారు.
గుజరాత్ లోని ఆలయాలు !
గుజరాత్ శాసన సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ ఆ రాష్ట్రంలోని అనేక ఆలయాలు సందర్శించారు. ప్రధానంగా బలరామ్ బాపా, ద్వారకదేష్, సోమనాథ్, చోటీలా ఆలయాలు సందర్శించిన రాహుల్ గాంధీ ప్రత్యేక పూజలు చేశారు.
హిందువులకు కాంగ్రెస్ గాలం !
రాహుల్ గాంధీ ఆలయాల సందర్శనపై బీజేపీకి చెందిన పలువురు తీవ్ర విమర్శలు చేశారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసమే ఇలా చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కూడా హిందూవుల అనుకూల వాదాన్ని అనుసరిస్తోందన్న సంకేతాలు ఇచ్చేలా రాహుల్ గాంధీ ఆలయాల సందర్శన ఉందనే విమర్శలు వెల్లువెత్తాయి.
మేము శివ భక్తులం !
అహ్మదాబాద్ లో ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ ర్యాలీలకు పోలీసులు అనుమతి నిరాకరించిన సందర్బంలో ఇద్దరు నాయకులు వేర్వేరు ప్రాంతాల్లో ఆలయాలు సందర్శించారు. మంగళవారం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ తానతో పాటు తన కుటుంబ సభ్యులు శివ భక్తులం అని మరోసారి చెప్పారు.