అద్వానీజీ కడిగిన ఆణిముత్యం: మోడీ
న్యూఢిల్లీ: హవాలా కుంభకోణం వెలుగు చూసిన సమయంలో మన పార్టీ కురువృద్దుడు అద్వానీజీపై ఆరోపణలు వచ్చాయని, అయితే ఆయన కడిగిన ఆణిముత్యంలా బయటికొచ్చారని దేశ ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ ఎంపీలతో అన్నారు.
మంగళవారం బీజేపీపీపీ కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆ పార్టీల ఎంపీల సమావేశం జరిగింది. భేటీ అనంతరం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు.
హవాల కేసు విషయంలో అద్వానీపై అప్పట్లో ప్రతిపక్షాలు ఇదే రాద్దాంతం చేశాయని, అయితే అద్వానీజీ ఆ కేసు నుంచి కడిగిన ఆణిముత్యంలా బయటకు వచ్చారని మోడీ చెప్పారని అన్నారు. అద్వానీ క్లీన్ చిట్ తో బయటకు వచ్చినట్లే ఇప్పుడు అరుణ్ జైట్లీ సైతం క్లీన్ చిట్ తో బయటకు వస్తారని ప్రధాని మోడీ అన్నారని వెంకయ్యనాయుడు చెప్పారు.
డీడీసీఏ వివాదంపై ప్రతిపక్షాలు అరుణ్ జైట్లీ మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని, ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలు చెయ్యడమే కాంగ్రెస్ నాయకులు పనిగా పెట్టుకున్నారంటూ మోడీ విమర్శించారని అన్నారు.
గతంలోనూ సుష్మా స్వరాజ్, వసుంధరా రాజే, శివరాజ్ సింగ్ చౌహాన్ లపై కాంగ్రెస్ ఇదే విధంగా విమర్శలు చేసిందని, ఇప్పుడు అరుణ్ జైట్లీని టార్గెట్ చేసుకున్నారని మోడీ దుయ్యబట్టారని వెంకయ్యనాయుడు తెలిపారు.