కేరళ పర్యటనలో మోడీ ఉగ్ర ముప్పును ఎదుర్కొన్నారు: డీజీపీ
మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించడానికి ప్రధాని నరేంద్ర మోడీ గత శనివారం కేరళలోని కొచ్చిలో పర్యటించిన విషయం తెలిసిందే.
కొచ్చి: మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించడానికి ప్రధాని నరేంద్ర మోడీ గత శనివారం కేరళలోని కొచ్చిలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే, ఆ సమయంలో ప్రధాని మోడీ.. ఉగ్రవాదుల నుంచి పెద్ద ముప్పు ఎదుర్కొన్నారని ఆ రాష్ట్ర డీజీపీ టీపీ సేన్కుమార్ సంచలన విషయాలను వెల్లడించారు.
కొచ్చి మెట్రోను ప్రారంభించిన మోడీ, వెంకయ్య, పినరయితో ప్రయాణం
కొచ్చిలో ఎల్పీజీ టెర్మినల్ను వ్యతిరేకిస్తున్న వారిపై శుక్రవారం హైకోర్టు సమీపంలో పోలీసుల చర్యను ఆయన సమర్థించారు. దీనిపై సేన్ కుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు. మోడీ కాన్వాయ్ వెళ్లే మార్గంలో ఎస్పీజీ ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా నిరసనకారులు అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆయన తెలిపారు.
నిరసనకారులు అనూహ్యంగా దూసుకొచ్చారని, వారిని అదుపు చేయడానికి లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఈ ఆందోళన వెనుక తీవ్రవాద సంస్థల హస్తముందని స్పష్టం చేశారు. పోలీసులు లాఠీ ఛార్జీ జరపడంతో 20మంది గాయపడ్డారని తెలిపారు.
లాఠీఛార్జీకి కొచ్చి నగర పోలీసు కమిషనర్ యతీష్ చంద్ర ఆదేశాలిచ్చారని వచ్చిన ఆరోపణలను డీజీపీ తోసిపుచ్చారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రధాని మోడీ శనివారం కొచ్చిలో మెట్రో రైలును ప్రారంభించారు. ఆయన వెంట కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, కేరళ సీఎం పినరయి విజయన్ కూడా ఉన్నారు.