ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్లకు ప్రధాని మోడీ ఫోన్: కరోనా పరిస్థితిపై ఆరా
న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తున్న క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. కరోనా వ్యాప్తి ఎలా ఉంది? కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వ్యాక్సిన్ పంపిణీ, ఆక్సిజన్ కొరత వంటి తదితర విషయాలు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది.
ఏపీలో కరోనా పరిస్థితిపై ప్రధాని మోడీ ఆరా
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోడీ.. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు. కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రధానికి సీఎం జగన్ వివరించారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపర్చామని, కోవిడ్ బాధితులకు మంచి వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధానికి సీఎం జగన్ వివరించారు.
సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై అడిగితెలుసుకున్న ప్రధాని మోడీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ప్రధాని మోడీకి వివరించారు. ఇటీవల కరోనా బారినపడిన సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని అడిగి తెలుసుకున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు ఒడిశా, జార్ఖండ్ ముఖ్యమంత్రులతోనూ ప్రధాని మోడీ ఫోన్ చేసి మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పుదుచ్చేరి, జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్లతోనూ ప్రధాని మాట్లాడారు.
ఏపీ, తెలంగాణలో పెరుగుతున్న యాక్టివ్ కేసులు
తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,75,748 ఉండగా, మృతుల సంఖ్య 2579కి చేరింది. ప్రస్తుతం 77,127 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 20వేలకుపైగా కరోనా కేసులు నమోదు కాగా, 72 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 1,82,329 యాక్టివ్ కేసులున్నాయి.
Recommended Video
ఏపీకి చేరుకున్న 1.92 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు
ఇది ఇలావుండగా, ఏపీకి 1.92 లక్షల కరోనా టీకాలు అందుబాటులోకి వచ్చాయి. పుణెలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ నుంచి కోవిషీల్డ్ టీకాలు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. వాటిని గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. అక్కడ్నుంచి రాష్ట్రంలోని జిల్లాలకు టీకాలను అధికారులు తరలించనున్నారు. వ్యాక్సిన్ కొరత కారణంగా ప్రస్థుతం రాష్ట్రంలో 45ఏళ్లకు పైబడినవారికే టీకాలు ఇస్తున్న విషయం తెలిసిందే. 18-44 ఏళ్ల వయస్కులు మరో రెండు నెలల తర్వాత నుంచి వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.