నన్ను ఎగతాళి చేయొచ్చు, కానీ తెలియాలి: మోడీకి రాహుల్ కౌంటర్
తనను ఎగతాళి చేసినా మంచిదేనని, కానీ ప్రజలకు నిజం తెలియాలని, తన పైన వచ్చిన ఆరోపణల పైన ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలని ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ గురువారం అన్నారు.
లక్నో: తనను ఎగతాళి చేసినా మంచిదేనని, కానీ ప్రజలకు నిజం తెలియాలని, తన పైన వచ్చిన ఆరోపణల పైన ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలని ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ గురువారం అన్నారు. ఆయన యూపీలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు.
మోడీ తన పైన వచ్చిన అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిందే అన్నారు. తాను అడిగిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పడం లేదన్నారు. నోట్ల రద్దు పేరుతో మోడీ చేస్తోంది అవినీతి వ్యతిరేక పోరాటం కాదన్నారు.
ముందు, తాను ప్రశ్నించిన అవినీతి ఆరోపణలపై స్పందించాలన్నారు. తనను ఎగతాళి చేస్తే అభ్యంతరం లేదన్నారు. ముడుపుల పైన నిజాలు మాత్రం తెలియాలన్నారు. 2012, 2013 సంవత్సరాల్లో మోడీ తీసుకున్న ప్యాకెట్లలో ఏముందో చెప్పాలన్నారు.
మోడీ అవినీతికి పాల్పడ్డారా లేదా అనే దానికి సూటిగా సమాధానం చెప్పాలన్నారు. మోడీ పేదవాళ్ల పైన పోరాటం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోడీ పారిశ్రామికవేత్తలకు మేలు చేస్తూ సామాన్యులను మాత్రం క్యూ లైన్లో నిలబెడుతున్నారన్నారు.
క్యూలైన్లలో నిలబడ్డవారంతా అవినీతిపరులు కాదని, పారిశ్రామికవేత్తల రుణాలను రద్దు చేస్తున్న ప్రధాని.. రైతుల రుణాలను మాత్రం రద్దు చేయడం లేదన్నారు. రైతుల ఆత్మహత్యలను తాము ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ, వాటి గురించి చిన్న ముక్క కూడా మాట్లాడలేదన్నారు.