సాంకేతికతోనే సుపరిపాలన: సైన్స్ కాంగ్రెస్లో మోడీ
హైదరాబాద్: ప్రజా సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా శాస్త్రవేత్తలు పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. సాధికారత, ఉపాధి అవకాశాల మెరుగులో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చామన్నారు. ఆహారం, ఆరోగ్యం ప్రమాణాలు మెరుగుపర్చడంలో సఫలమయ్యామని వివరించారు.
కర్ణాటకలోని మైసూర్లో ఏర్పాటు చేసిన 103వ భారతీయ విజ్ఞాన సదస్సును నరేంద్ర మోడీ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ ఏడాది మొదట్లో విజ్ఞాన సదస్సు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. గొప్ప నేతలంతా మైసూరు విశ్వవిద్యాలయంలో చదువుకున్న వారేనన్నారు.
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్, మైసూరు విశ్వవిద్యాలయం ప్రయాణం ఒకేసారి ప్రారంభమైందన్న మోడీ... మైసూరు విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకల తరుణంలో సదస్సు జరగటం సంతోషంగా ఉందన్నారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతోనే సుపరిపాలన సధ్యమన్నారు.
2030 నాటికి పేదరిక నిర్మూలన, అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలవటమే లక్ష్యమని స్పష్టం చేశారు. శాస్త్ర, పరిశోధన రంగాన్ని అందరికీ అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. విజ్ఞాన రంగ లక్ష్యం కేవలం పరిశోధనలే కాదు, శాస్త్రీయ దృక్పథం కూడా పెపొందాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా టెక్నాలజీ విజన్-2035 డ్యాక్యుమెంట్ను ప్రధాని ఆవిష్కరించారు. 30మంది శాస్త్రవేత్తలకు ప్రధాని చేతులమీదుగా పురస్కారాలు ప్రదానం చేశారు. కేంద్రమంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ... ఆస్ట్రోశాట్ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించిందన్నారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి అన్ని ప్రభుత్వ విభాగాలతో కలిసి పనిచేస్తున్నామన్నారు.
డెంగీ, మలేరియా వ్యాక్సిన్ తయారీ పురోగతిలో ఉందన్నారు. నానో టెక్నాలజీలో మూడో స్థానంలో ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, దేశ విదేశాలకు చెందిన 10వేల మంది శాస్త్రవేత్తలు సదస్సులో పాల్గొన్నారు.
తమకూరులో హెలికాప్టర్ తయారీ
త్వరలో ప్రపంచ యవనికపై తుమకూరు జిల్లా తనదైన ముద్రవేయబోతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కర్ణాటకలోని తుమకూరులో హెలికాప్టర్ తయారీ కర్మాగారానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశరక్షణకు ఉపయోగపడే కర్మాగారం తుమకూరులో ఏర్పాటు కాబోతోందన్నారు.