ఫ్యామిలీ కోసం కాంగ్రెస్, దేశం కోసం బిజెపి: మోడీ
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రవర్తన అత్యయిక పరిస్థితిని తలపిస్తోందని వ్యాఖ్యానించారు.
పార్టీ నేతలు, భాగస్వామ్య పక్షాల నేతలతో పార్లమెంట్ కార్యాలయంలో మోడీ గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, దేశ రక్షణకు భారతీయ జనతా పార్టీ శ్రమిస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం ఓ కుటుంబాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్న నిరాశతో ఒక కుటుంబాన్నే ఆ పార్టీ నమ్ముకుందని ఎద్దేవా చేశఆరు. అనంతరం ఎన్డీఏ ఎంపీలు విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ చేపట్టారు.
ఎన్డీయే ర్యాలీలో అగ్రనేత అద్వానీ
కేంద్రంలో బిజెపి అధికారం చేపట్టినప్పటి నుంచి ఆ పార్టీ అగ్ర నేత ఎల్కె అద్వానీ సైలెంట్గానే ఉంటున్నారు. ప్రస్తుత రాజకీయాలలో ఆయన చురుకైన పాత్రను పోషించడం లేదు. అయితే, గురువారం ఎన్డీఏ ఎంపీలతో కలసి ఆయన ఢిల్లీ వీధుల్లో నడిచారు.
విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు వారు ర్యాలీ చేపట్టారు. పార్లమెంటులో చేపట్టిన చర్చలకు అనుక్షణం అడ్డుతగులుతూ, సమావేశాలను స్తంభింపజేసిన విపక్షాల తీరును తప్పుబడుతూ ఎన్డీఏ ఎంపీలు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అద్వానీ సహా కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ, సుష్మా స్వరాజ్, రాంవిలాశ్ పాశ్వాన్ తదితరులు పాల్గొన్నారు.