"ప్రాణం పోయినా నల్లధనంపై వెనక్కి తగ్గేది లేదు.. 50రోజులు ఓపిక పట్టండి"
గోవా : గత ఎన్నికల్లో అవినీతిని అంతమొందిస్తానని చెప్పాను కాబట్టే.. ప్రజలంతా ఓట్లేశారని, 50రోజులు ఓపిక పడితే.. దేశ ప్రజలంతా కలలు గన్న నవభారత్ సాక్షాత్కరం అవుతుందని మోడీ తెలిపారు. 'దేశం కోసం కుటుంబాన్ని సైతం వదులుకున్నానంటూ' ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు మోడీ. అత్యంత సీక్రెట్ గా చేపట్టిన ఈ నోట్ల రద్దు ఆపరేషన్ కోసం గడిచిన పదినెలలుగా శ్రమిస్తున్నామని తెలియజేశారు.
నల్ల కుబేరుల సొమ్మంతా దేశానిదే అని, నల్లధనాన్ని బయటపెట్టి దేశప్రజల రుణం తీర్చుకుంటానని ఈ సందర్బంగా మోడీ ప్రకటించారు. ఏదైనా మంచి మార్పును చూడాలని భావించే వేళ, ఈ తరహా కష్టాలు తప్పవని మోదీ అభిప్రాయపడ్డారు. తన నిర్ణయాన్ని ప్రజలంతా అంగీకరించారని, ఈ విషయంలో విపక్షాలు చేస్తున్న విమర్శలను తాను పట్టించుకోబోనని అన్నారు. ' ప్రాణం పోయినా సరే నల్లధనం పోరు ఆగబోదని' కుండబద్దలు కొట్టారు మోడీ.
ఇక తన నిర్ణయాన్ని స్వాగతించిన ప్రతీ భారతీయుడికి సలాం చేస్తున్నట్టుగా తెలిపారు మోడీ.తన జీవితం ప్రజల కోసమే అంకితమని, ప్రజల కోసమే జీవిస్తానని, ప్రజల కోసమే మరణిస్తానని ప్రకటించారు. రాత్రికి రాత్రి తాను తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన కోట్లాది మంది ప్రశాంతంగా నిద్రపోగా, ఇంట్లో నల్లధనాన్ని ఉంచుకున్న వారికి మాత్రమే నిద్రలేకుండా పోయిందని ఆయన అన్నారు.
నగదు కొనగోళ్లపై పాన్ అవసరం లేదని పలువురు సూచించారని, అయినా సరే తాను ఎవరి మాట వినలేదని పేర్కొన్నారు. తాజా నిర్ణయంతో కొంతమంది అవినీతిపరుల సామ్రాజ్యం కుప్పకూలిందని వ్యాఖ్యానించారు. కొత్త నోట్ల రద్దుతో సామాన్యుల పడుతున్న కష్టాలను ప్రస్తావిస్తూ.. 60 సంవత్సరాల రోగాన్ని పోగొట్టేందుకు ఆరు రోజులైనా పట్టదా? అని ప్రశ్నించారు. 50రోజుల పాటు దేశ ప్రజలంతా ఓపిక పట్టాల్సిందిగా పిలుపునిచ్చారు.
ఇక దేశాలు పట్టుకుని తిరుగుతున్నాడని తనపై చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. గత ప్రభుత్వాల ఒప్పందాలను ఈ పర్యటనల ద్వారా తెలుసుకుంటున్నట్టుగా ఆయన వివరించారు. గోవాలో నేటి ఉదయం గోవాలో రెండు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం జాతిని ఉద్దేశిస్తూ ప్రసంగించిన మోడీ భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు.