తమిళనాడు, కేరళలో ప్రధాని మోడీ పర్యటన, రూ. వేల కోట్లలో నష్టం, ఏం చేస్తారు ?
చెన్నై: తమిళనాడులో ఓఖీ తుపాను కారణంగా దెబ్బతిన్న కన్యాకుమారి జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం మధ్యాహ్నం పర్యటించనున్నారు. లక్షద్వీప్, తమిళనాడు, కేరళలో ఓఖీ తుపాను బీభత్సం సృష్టించడంతో రూ. వేల కోట్లలో ఆర్థిక నష్టం వాటిల్లింది. రైతులు లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయారు. మత్స్యకారులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ ప్రాంతాల్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఎంత నష్టపరిహారం ప్రకటిస్తారు అని స్థానిక ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
లక్షద్వీప్ లో ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం లక్షద్వీప్, కన్యాకుమారి జిల్లా, కేరళలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం లక్షద్వీప్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ తుపాను దెబ్బకు నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అక్కడి అధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నారు.
కన్యాకుమారిలో
మంగళవారం మద్యాహ్నం కన్యాకుమారికి ప్రత్యేక హెలికాప్టర్ లో చేరుకుంటున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆ జిల్లాలోని కొన్ని గ్రామాలు పరిశీలించి రైతులు, మత్య్సకారులతో మాట్లాడనున్నారు. సాయంత్రం ఆయన కేరళలోని తిరువనంతపురం జిల్లాలో రెండు మత్స్యకారుల గ్రామాలు సందర్శించి స్థానిక జాలర్ల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.
బీజేపీ ప్లాన్ ఇదే !
ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో బీజేపీ నేతలు కూడా పార్టీ పరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బాధితులు వారి సమస్యలను ప్రధాని నరేంద్ర మోడీకి వివరించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన బీజేపీ నాయకులు ఇప్పటికే కన్యాకుమారిలో మకాం వేశారు.
చీకటిలో గ్రామాలు
కన్యాకుమారి జిల్లాకు చెందిన అనేక మంది జాలర్లు సముద్రంలో గల్లంతు కావడంతో ఇప్పటికీ గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తమిళణాడులోని కన్యాకుమారి జిల్లాలో అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. పెద్ద సంఖ్యలో విద్యుత్తు స్థంభాలు పూర్తిగా ధ్వంసం కావడంతో కొన్ని ప్రాంతాల ప్రజలు చాలా రోజులపాటు చీకటిలో కాలంగడిపారు.
ప్రధాని మోడీ ఆదేశాలు
ప్రధాని మోడీ ఆదేశాల మేరకు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పొన్ రాధాకృష్ణన్ లు కన్యాకుమారి జిల్లాలో పర్యటించారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, పలువురు మంత్రులు అక్కడ పర్యటించి సహాయకచర్యలు పర్యవేక్షించారు.
మోడీకి రాహుల్ గాంధీ లేఖ
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం ఇప్పటికే తమిళనాడు, కేరళలో పర్యటించారు. ఇక్కడి పరిస్థితులను చూసి చలించిపోయారు. మత్స్యకారులకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ విషయంపై తాజాగా రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ కూడా రాశారు.