ప్రధాని మోదీ సంచలనం: ఉక్రెయిన్ పర్యటనకు రెడీ
PM Modi visit Ukrain: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యా సాగిస్తోన్న దాడులతో అల్లకల్లోలంగా తయారైన ఉక్రెయిన్లో పర్యటించనున్నారు. ఈ నెల 21, 22, 23 తేదీల్లో ఈ రెండు దేశాల్లో పర్యటించనున్నారు. తొలుత పోలెండ్, అనంతరం ఉక్రెయిన్కు వెళ్తారు.
ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఉక్రెయిన్పై రష్యా దండెత్తిన తరువాత ఆ దేశ పర్యటనకు మోదీ బయలుదేరి వెళ్లబోతోండటం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రష్యాతో సుదీర్ఘకాలంగా ఉన్న స్నేహపూరక సంబంధాలపై దీని ప్రభావం ఎలా ఉండొచ్చనేది ఆసక్తి రేపుతోంది.

21న పోలెండ్కు బయలుదేరి వెళ్తారు. ఆ దేశాధ్యక్షుడు ఆండ్రెజ్ డుడా, ప్రధాని డొనాల్డ్ టస్క్తో రాజధాని వార్సాలో సమావేశమౌతారు. ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. 40 సంవత్సరాల తరువాత పోలెండ్ పర్యటనకు ఓ భారత ప్రధాని వెళ్లబోతోండటం ఇదే తొలిసారి. 1979లో చివరిసారిగా అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్.. ఈ దేశాన్ని సందర్శించారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య హోరాహోరీగా యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. దీనికి విరామం అనేది ఉండట్లేదు. 2022 ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. రష్యా దాడుల్లో ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. పలువురు ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది.
అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు. సై అంటే సై అంటోన్నాయి. రష్యా చేస్తోన్న దాడులను ఉక్రెయిన్ సమర్థవంతంగా అడ్డుకుంటోంది. ఇన్ని రోజులుగా సాగుతున్న ఈ యుద్ధం వల్ల ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు నేలమట్టం అయ్యాయి. వాటిని రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి.
మరియోపోల్, మెలిటొపోల్, క్రిమియా, డాన్బాస్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, సుమి, ఒడెస్సా, చెర్న్హీవ్.. వంటి నగరాలను రష్యా సైనిక బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కీలకమైన కర్క్స్ రీజియన్ను సైతం తమ ఆధీనంలోకి తెచ్చుకోగలిగినట్లు రష్యా ప్రకటించింది.
రాజధాని కీవ్ను రష్యా సైనికులు చుట్టుముట్టినప్పటికీ.. అంత తేలిగ్గా లొంగట్లేదు. ఈ దాడులు ప్రతిదాడులతో ఉక్రెయిన్ తూర్పు ప్రాంతం మొత్తం అట్టుడికి పోతోంది. ఎప్పుడేం జరుగుతుందో, ఏ రాకెట్ వచ్చి ఏ భవనాన్ని ధ్వంసం తెలియని వాతావరణం నెలకొందక్కడ.
ఈ పరిస్థితుల్లో మోదీ ఉక్రెయిన్లో అడుగు పెట్టబోతోన్నారు. పోలెండ్ నుంచి నేరుగా కీవ్కు చేరుకుంటారు. ఆ దేశాధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీతో ముఖాముఖి సమావేశమౌతారు. మొన్నటివరకు తటస్థంగా ఉంటూ వచ్చింది భారత్. ఇప్పుడు ఉక్రెయిన్లో పర్యటించబోతోండటం చర్చనీయాంశమౌతోంది.












Click it and Unblock the Notifications