'నోట్ల రద్దు వెనుక పెద్ద మతలబు, కేంద్రం బెదిరింపులు'
నోట్ల రద్దు పైన చర్చ జరిగితే ప్రధాని నరేంద్ర మోడీ సభలోనే ఉండాలని విపక్షాలు, ఆయన సభకు వస్తారని, చర్చ ప్రారంభించాలని అధికార పార్టీ రాజ్యసభలో పట్టుబట్టాయి.
న్యూఢిల్లీ: నోట్ల రద్దు పైన చర్చ జరిగితే ప్రధాని నరేంద్ర మోడీ సభలోనే ఉండాలని విపక్షాలు, ఆయన సభకు వస్తారని, చర్చ ప్రారంభించాలని అధికార పార్టీ రాజ్యసభలో పట్టుబట్టాయి. దీంతో సభ మూడోసారి శుక్రవారానికి వాయిదా పడింది.
సభ అనంతరం మాయావతి, మమతా బెనర్జీలు విలేకరులతో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు వెనుక చాలా పెద్ద మతలబు ఉందని మాయావతి ఆరోపించారు. ముందస్తు ప్రణాళికలు రచిస్తే సామాన్యులకు ఇన్ని సమస్యలు ఎందుకు వచ్చాయని ఆమె ప్రశ్నించారు.
ప్రశ్నించే వారిని కేంద్రం బెదిరిస్తోందని మమతా బెనర్జీ అన్నారు. కేంద్రం నిర్ణయంతో రాష్ట్రాలలో ఆర్థిక వ్యవస్థ స్తంభించిందన్నారు. నోట్ల రద్దుతో జిడిపి 2 శాతం తగ్గుతుందన్నారు.
అంతకుముందు సభలో...
ప్రధాని మోజడీ సభలో లేకుంటే, సభ నుంచి వెళ్లిపోతే చర్చలో పాల్గొన్నట్లు ఎలా అవుతుందని విపక్షాలు ప్రశ్నించాయి. ప్రధాని నరేంద్ర మోడీ సభలో ఉంటేనే చర్చ జరుగుతుందన్నారు.
ఈ సందర్భంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ సభకు వస్తారని మంత్రీ జైట్లీ చెబుతున్నారని, కాబట్టి చర్చకు రావాలని విపక్షాలను కోరారు. చర్చను ప్రారంభించాలన్నారు.
బీజేపీ సభ్యులు ముక్తార్ అబ్బాస్ నక్వీ మాట్లాడుతూ... సభ్యులు ఏం చెప్పాలనుకుంటున్నారో చర్చ సందర్భంగా చెప్పాలన్నారు. ప్రధాని వస్తారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆనంద్ శర్మ మాట్లాడుతూ.. యూపీఏ హయాంలో బీజేపీ కూడా ప్రధాని సభకు రావాలని పట్టుబట్టిందన్నారు. ప్రధాని సభలో గంటపాటు ఉంటారంటే సభ్యులు అంగీకరించలేదన్నారు.
అధికార, విపక్షాల వాగ్వాదం జరుగుతుండగానే.. విపక్ష సభ్యులు ప్రధాని మోడీ సభకు రావాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. అబద్దపు హామీలు ఇవ్వవద్దని విపక్షాలు నిరసన తెలిపాయి.