రాహుల్ వ్యాఖ్యలు: ప్రధాని కుమార్తెలపై సంజయ్ బారు
ముంబై: ‘ది యాక్సిండెంటల్ ప్రైమినిస్టర్' పుస్తక రచయిత సంజయ్ బారు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మన్మోహన్ సింగ్ తన పదవి నుంచి తప్పుకోవాలని అతని కుమార్తె కోరుకున్నట్లు ఆయన తెలిపారు. దోషులైన వారు ఎన్నికల్లో పోటీ చేయకూడదనే కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని ఓ మీడియా సమావేశంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖండించారని, ఇదో నాన్సెన్స్గా అభివర్ణించారని చెప్పారు.
రాహుల్ వ్యాఖ్యల అనంతరం మన్మోహన్ సింగ్ తన పదవి నుంచి తప్పుకోవాలని ఆయన కుమార్తె కోరుకున్నట్లు తెలిపారు. ముంబైలో బుధవారం తన పుస్తకం ‘ది యాక్సిండెంటల్ ప్రైమినిస్టర్' ఆవిష్కరణ సందర్భంగా సంజయ్ బారు మాట్లాడారు. 2009లో తిరిగి యూపిఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని పదవికి రాజీనామా చేయాలని పలుమార్లు మన్మోహన్ సింగ్కు తాను సూచించినట్లు తెలిపారు. చివరకు తానే ఓ టెలివిజన్ ముందుకు వచ్చి ప్రధాని రాజీనామా చేయనున్నట్లు ప్రకటించానని చెప్పారు.
ఆ సమయంలోనే తనకు ఓ టెక్ట్స్ మెసేజ్ వచ్చిందని తెలిపారు. ఆ మెసేజ్లో ప్రధాని పదవికి రాజీనామా నిర్ణయాన్ని తాను కూడా స్వాగతిస్తున్నట్లు మన్మోహన్ సింగ్ కూతురు పేర్కొన్నారని చెప్పారు. 2009 ఎన్నికల విజయం తనదేనని మన్మోహన్ సింగ్ నమ్మారని చెప్పారు. మన్మోహన్ సింగ్ను ఎప్పుడూ కాలు మీద కాలు వేసుకుని కూర్చుండగా చూడలేదని చెప్పిన సంజయ్ బారు, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయనను కలిసేందుకు వెళ్లిన సమయంలో (జూన్ 2, 2009) మాత్రం విజయంపై చర్చించుకుంటూ ఆ విధంగా కూర్చున్నారని తెలిపారు.
అయితే ఈ విజయాన్ని మన్మోహన్కే దక్కుతుందని ఎవరూ గుర్తించలేదని అన్నారు. తన స్నేహితుడు పృథ్వీరాజ్ ఛవాన్ అనే వ్యక్తి ఈ విజయం రాహుల్ గాంధీ వల్లే సాధ్యమైందని ప్రధానికి చెప్పారని అన్నారు. యూపిఏ విజయం సాధించడంలో తమ తండ్రి క్రెడిట్ను గుర్తించని కారణంగా ప్రధాని ఇద్దరు కూతుళ్లు మన్మోహన్ సింగ్ తన పదవికి రాజీనామా చేయాలని కోరుకున్నట్లు తెలిపారు. తన పుస్తకం ఓ నూతన ప్రయోగమని చెప్పారు. ఇది ఐదేళ్లు పని చేస్తుందని, ఆ తర్వాత ఐదేళ్లు ఆగిపోతుందని చెప్పారు. మన్మోహన్ సింగ్ తన పదవి కాలంలో బలహీన ప్రధానిగా ముద్రవేసుకున్నారని, ప్రస్తుతం భారత ప్రజలు నమ్మకమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు.