మమత ఓ స్పీడ్ బ్రేకర్! రాష్ట్రాన్ని దోచుకుతిన్నారు! బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ
కోల్కతా : రెండోసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రచారంలో జోరు పెంచారు. సుడిగాలి పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. బెంగాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సిలిగురి, కోల్కతాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్లు టార్గెట్గా విమర్శనాస్త్రాలు సంధించారు.
అధికారంలోకి వస్తే ఎన్నికల సంస్కరణలు ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరిస్తామన్న కాంగ్రెస్
మమత స్పీడ్ బ్రేకర్
బెంగాల్ సీఎం మమత బెనర్జీపై ప్రధాని మోడీ నిప్పులు చెరిగారు. సిలిగురిలో జరిగిన సభలో పాల్గొన్న ఆయన.. దీదీని స్పీడ్ బ్రేకర్తో పోల్చారు. అభివృద్ధి నిరోధకురాలైన మమత అధికారం చేపట్టాక బెంగాల్లో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. స్పీడ్ బ్రేకర్లాంటి మమత వైదొలగినప్పుడే రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతమవుతుందని మోడీ అభిప్రాయపడ్డారు.
దోపిడీ దొంగల పాలైన రాష్ట్రం
మమత హయాంలో రాష్ట్రం దోపిడీ దొంగల పాలైందని మోడీ ఆరోపించారు. ఈ సందర్భంగా బెంగాల్లో జరిగిన చిట్ ఫండ్ స్కాంలను ఆయన ప్రస్తావించారు. దీదీ పాలనలో మినిస్టర్లు, ఆఫీసర్లు పేద ప్రజల సొమ్ము దోచుకుని పరారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్వార్థం కోసం మమత బెంగాల్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు అందకుండా చేస్తున్నారన్న మోడీ.. నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించే ఆయుష్మాన్ భారత్ ను ఆమె అడ్డుకుంటున్నారని విమర్శించారు.
మోడీ చేసిన తప్పేంటి?
బీజేపీని గద్దె దింపేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమవడంపైన మోడీ స్పందించారు. మోడీ హఠావో అంటున్న విపక్షాలు తాను చేసిన తప్పేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్లు, గ్యాస్, టాయిలెట్ సౌకర్యం కల్పించినందుకు అధికారం నుంచి తప్పుకోవాలా అని మోడీ ప్రశ్నించారు. ఐదేళ్ల పాలనలో అసాధ్యాన్ని సుసాధ్యం చేశామన్న మోడీ.. కాంగ్రెస్ తీరును కడిగిపారేశారు. మోసపూరిత హామీలిచ్చి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న ఆ పార్టీ మేనిఫెస్టో మే 23న మురిగిపోతుందని అన్నారు.